Monday, April 29, 2024

WGL: వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. అన్నదాతల్లో ఆనందం


ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. గత కొద్ది రోజులుగా పంటలు వేసి వరుణుడి రాక కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వర్షం ఊపిరి పోయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జయశంకర్ జిల్లాలో 503.8 మిమి మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలోని మహదేవపూర్ మండలంలో 18.6 మిమి, పలిమేల 21.8 మిమి, మహా ముత్తారం 50.4 మిమి, కాటారం 38.8 మిమి, మలహర్ రావు 35మిమి, చిట్యాల 64.8మిమి, టేకుమట్ల 57మిమి, మొగుళ్లపల్లి 55.6మిమి, అత్యధికంగా రేగొండలో 73.మిమి నమోదు కాగా గణపురం 41.మిమి, భూపాలపల్లిలో 47మిమి గా నమోదు అయింది.


కాళేశ్వరం గోదావరి వద్ద పెరుగుతున్న నీటిమట్టం…
జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. మహరాష్ట్ర, తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత, గోదావరిలోకి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. మంగళవారం కాళేశ్వరం పుష్కర ఘాట్ మెట్ల వద్ద 7.520 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. ఎగువ నుండి (అన్నారం) సరస్వతి బ్యారేజ్ కి 7,590 క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో అన్నారం బ్యారేజ్ లో 8.08 టీఎంసీల నీటి నిల్వ చేరింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు వరద తాకిడి పెరగడంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 35 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో 1,62,820 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 2,10,830 క్యూసెక్ లుగా వుంది. బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.330టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement