Saturday, May 4, 2024

రాష్ట్రంలో కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ : మంత్రి ఎర్ర‌బెల్లి

రాష్ట్రంలో కోటి మందికి బతుకమ్మ చీరలను అందజేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండల కేంద్రాల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ముందుగా ప్రతి మండల కేంద్రంలో మంత్రికి మహిళలు, డప్పు చప్పుళ్ళు, సంప్రదాయ బతుకమ్మలు, మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ర్యాలీలో మంత్రి బతుకమ్మను తలపై ఎత్తుకొని మహిళలతో కలిసి నడిచారు. అనంతరం ఆయా మండలాల్లోని వివిధ గ్రామాల మహిళలకు బతుకమ్మ చీరలు మంత్రి అందజేశారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే కొత్త సంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదలు పెట్టారన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామ‌న్నారు.

ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులంద‌రికీ ఇంట్లో పెద్దకొడుకుగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు 10 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ – దారపు పోగుల అంచులతో చీరలు త‌యారు చేశార‌న్నారు. ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కోసం మొత్తం రూ.339.73 కోట్ల ఖర్చు చేసిన‌ట్లు తెలిపారు. ఈసారి కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం పట్ల కేసీఆర్, కేటీఆర్ లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామ‌న్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 3 కోట్ల 70 లక్షల విలువైన 1లక్షా 9 వేల 775 చీరలు పంపిణీ జరుగుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, సీనియర్ నాయకులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement