Saturday, May 18, 2024

చిల్పూర్ లో.. సీఎల్పీ నేత భట్టి ప్రజలతో రచ్చబండ

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కల్లుగీత కార్మికులు మాటూరి కిరణ్, తీగల గిరి మాట్లాడుతూ.. బెల్టుషాపులు, చీప్ లిక్కర్ తెచ్చి తమ పొట్ట కొడ్తుంది ఈ ప్రభుత్వం. తమ బతుకులు అగమవుతున్నాయి. తినేందుకు తిండి కూడా సంపాదించలేకపోతున్నాం. గీతం కార్మికులు మొత్తంగా చెట్లు ఎక్కడం బంద్ చేసే రోజులు వచ్చాయి. తాము చాలా కష్టాల్లో ఉన్నాము. తమకు ఇన్సూరెన్స్ కూడా కావాలని చెప్పారు. మట్టా అంజవ్వ మాట్లాడుతూ.. మా ఊరికి ఏమీ రావడం లేదు. ఎవరు వచ్చినా ఏమీ చేయడం లేదు.. కూలీ చేసుకుని బతుకుతున్నాం.. మేము బతికినా ఒక్కటే చచ్చినా ఒక్కటే.. ఫింఛన్లు కూడా ఇవ్వడం లేదు.. కనీసం వంద రోజులు పని ఇయ్యడం లేదు.. చేసిన పనికి బ్యాంకులో డబ్బులు వెయ్యడం లేదు. మేమెట్లా బతకాలని ఆవేదనగా చెప్పింది.

అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తున్న తమకు ఈ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ ప్రేమాభిమానాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాము. తాను ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసీలను, గిరిజనులను, బొగ్గుబాయిల్లో పనిచేస్తున్న కార్మికులను, కాకాతీయ విద్యార్థులను, వరంగల్-హన్మకొండ ప్రజలతో మాట్లాడుతూ ఇక్కడకు వచ్చాను. సాధ్యమైనంత వరకూ ప్రతిగ్రామంలో ప్రజలతో మాట్లాడుతున్నాను. దశాబ్దాల పోరాటాల తరువాత తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ అన్నీ వస్తాయనుకున్నాం. కానీ ఎవ్వరికీ ఏమీ రావడం లేదని ప్రజలు ఆవేదనగా చెబుతున్నారు. తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు రావడం లేదు. నిధులు ప్రభుత్వ పెద్దలే దోచేస్తున్నారు. ఆత్మగౌరవం లేకుండా పోయింది. భూమిని పంచడం లేదు. నిరుపేదల జీవితాల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. మిగులు బడ్జెట్ తో తెచ్చుకున్న రాష్ట్రం అప్పులపాలైందన్నారు. తెచ్చుకున్న తెలంగాణలోని రెండు నదుల్లో నీళ్లున్నాయి. సంపద ఉంది. అయినా మనకెందుకు ఏమీ రావడం లేదో ఒక్కసారి ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రావాళ్లు మనకు ఏమీరాకుండా అడ్డుకుంటున్నారని.. తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. మన రాష్ట్రంలో మన పాలకులే మన ప్రజలకు ఏమీ రాకుండా ఇప్పుడు అడ్డుకుంటున్నారన్నారు. సంపద పంచబండడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదన్నారు. ప్రజల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ.. పాలకుల కోసం.. మనందరి జీవితాల్లో మార్పు కోసం విద్యార్థులు అగ్నికి ఆహుతయ్యారన్నారు. బలిదానాలు చేశారు.. మనకు కావాల్సింది ప్రజా ప్రభుత్వం కానీ.. కుటుంబ దొరల ప్రభుత్వం కాదన్నారు. రాష్ట్ర సంపదను ప్రభుత్వ పెద్దలు పందికొక్కుల్లా మెక్కుతున్నారన్నారు.

మన సంపద మనకు పంచే ఇందిరమ్మ రాజ్యం కావాలన్నారు. ఇండ్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించే ప్రజా ప్రభుత్వం రావాలన్నారు. చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా పాటించే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెబుతున్నామన్నారు.. వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు, బియ్యంతో పాటు 9 సరుకులు సంచిలో పెట్టి ఇస్తామన్నారు. వృధ్దులకు, వికలాంగులకు పింఛ‌న్ ఇవ్వండతో పాటు ఆరోగ్య శ్రీ కార్డు పరిధిని రూ.5 లక్షలకు పెంచుతామ‌న్నారు. చదువుకునే పిల్లలకు ఫీజు రీఎంబర్స్ మెంట్, వంట గ్యాస్ ను రూ.500 కే ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు, రైతు కూలీలకు, భూమిలేని నిరుపేదలకు, వందరోజుల పనికి వెళ్లేవారికి ప్రతి ఏడాది కైలీ బంధు పేరుతో రూ.12వేలు ఇస్తామ‌న్నారు. మహిళా సాధికారత కోసం డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు పెద్ద ఎత్తున ఇస్తామ‌న్నారు. ఐకేపీ మహిళల‌కు వడ్డీ లేని రుణాలు పెద్ద ఎత్తున ఇస్తామ‌న్నారు. గతంలో మాదిరిగానే ధాన్యాన్ని కల్లాల్లోనే కాటావేసి ఐకేపీ కేంద్రాల ద్వారా వెంటనే కొనుగోలు జరిపిస్తామ‌న్నారు. జాబ్ కేలండర్ ఇవ్వడంతో పాటు.. ప్రశ్నాపత్రాలు లీకేజీ కాకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగులు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత నిర్భంధ ఇంగ్లీషు విద్యను అందిస్తామ‌న్నారు. గోదావరి జలాలను పంటపొలాలకు మళ్లిస్తామ‌న్నారు. రైతన్నల కాళ్లు కడుగుతామ‌న్నారు. సామాజిక అభివృద్ధి సాధించి ఆత్మగౌరవంతో జీవించేలా తెలంగాణను నిర్మిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement