Friday, May 31, 2024

TS | కాళేశ్వ‌రంపై కీలక భేటీ… ఎన్డీఎస్ఏ నివేదికపై సీఎం రేవంత్ ఆరా

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి.. ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆరా తీశారు. శనివారం సాయంత్రం సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన చర్చలు జరిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం వెంట ఉన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవటంతో, తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునురుద్ధరణ చర్యలపై ఇటీవల ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని తోసిపుచ్చలేమని ఎన్డీఎస్ఏ అందులో స్పష్టం చేసింది.

మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. రిపేర్లు చేయాలా.. ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా.. మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. శనివారం నాటి కేబినేట్ భేటీ జరుగకపోవటంతో ఈ కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement