Sunday, April 28, 2024

Murder: తాగుబోతు కుమారుడు వేధింపులు… కాటికి పంపిన తండ్రి

మద్యానికి బానిసైన కొడుకు నిత్యం తప్ప తాగి వచ్చి కన్న తల్లిదండ్రులను వేధిస్తూ పలు విధాలుగా చిత్రహింసలకు గురిచేయగా కొడుకు వేధింపులు తట్టుకోలేక కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపాడు తండ్రి. ఈ దారుణ సంఘటన గంభిరవుపేట మండలంలోని సముద్ర లింగాపురం గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. వివరాలిలా వున్నాయి…. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరావు పేట మండలంలోని సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన కుంట సాయిలుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు కుంట రమేష్ (30) మద్యానికి బానిసై పనిలేకుండా ఖాళీగా వుంటూ తప్ప తాగుతూ తరచూ తల్లిదండ్రులను వేధించేవాడు. ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ తల్లిదండ్రులను చిత్రహింసలు పెడుతూ వారిని మానసికంగా చిత్ర హింసలు పెట్టేవాడు.

ఈ రోజు ఉదయం ఇంట్లో తీవ్రంగా గొడవ చేయడంతో కొడుకు వేధింపులు భరించలేక విసుగెత్తిన తండ్రి సాయిలు సహనం కోల్పోయి క్షణికావేశంలో ఇంట్లో ఉన్న గొడ్డలితో రమేష్ తలపై నరికాడు. దీంతో రమేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న గంభీరావు పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికీ పంచనామా చేశారు. పోస్టుమార్టం నిమిత్తం రమేష్ మృతదేహాన్ని సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకును హతమార్చిన వృద్ధుడైన తండ్రి సాయిలును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement