Monday, April 29, 2024

దేశ రాజ‌కీయాల్లోకి టీఆర్ ఎస్‌.. త్వ‌ర‌లోనే పార్టీ పేరు ప్ర‌క‌టించ‌నున్న కేసీఆర్‌

జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి త‌గ్గ‌ట్టు పావులు కదుపుతున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర చాటాలని ఉవ్విళ్లూరుతున్న ఆయన కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పట్టదలగా ఉన్నారు. దీనికోసం ఈ మ‌ధ్య ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పర్యటించారు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను జాతీయ పార్టీగా మార్చి దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా మారాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి పార్టీ పేరు కూడా దాదాపు ఖ‌రార‌య్యింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న జరగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీ విషయంలో ఫైన‌ల్ డెసిష‌న్ ఏంట‌న్న‌ది స్ప‌ష్టం చేస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలతో నిన్న ప్రగతి భవన్‌లో ఈ విష‌య‌మ్మీద కూడా సుదీర్ఘంగా సీఎం కేసీఆర్‌ చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో దేశ రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ పోషించబోతున్న పాత్రపైనా చర్చ జరిగింది. దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యల గురించి చర్చ జరగడం లేదని, మాట్లాడదామంటే ‘జైశ్రీరాం’ నినాదాలతో అడ్డుకుంటున్నారని, రాజకీయ లబ్ధికోసం మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆక్షేపించిన‌ట్టు సమాచారం.

దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఈ మ‌ధ్య‌ జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 97శాతం అపజయాలు మూటగట్టుకుందని గుర్తు చేశారు. కాబట్టి దేశ ప్రజల అవసరాలు తీర్చుందుకు జాతీయ పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్దామని నేతలతో కేసీఆర్ అన్నట్టు సమాచారం. జాతీయ పార్టీ ఏర్పాటు చేద్దామన్న కేసీఆర్ ప్రతిపాదనకు నేతలు కూడా ఏకీభవించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19 లోగా కార్యవర్గ సమావేశం నిర్వహించి.. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చే విషయంలో తుది నిర్ణయం ప్రకటించనున్నారని, నెలాఖరులో ఢిల్లీలో పార్టీని ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement