Monday, May 6, 2024

కాపురానికి వెళ్లని కూతురు.. కోపంతో కర్రతో బాది తల్లీ కూతుళ్లను చంపేసిన తండ్రి

మహబూబ్‌న‌గ‌ర్‌ క్రైం, (ప్రభ న్యూస్) : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జ‌రిగింది. మండల పరిధిలోని జైనల్లిపూర్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కూతురు కాపురానికి వెళ్లడం లేదని మనస్తాపానికి గురైన తండ్రి తన భార్యతో పాటు కూతురిని కూడా కర్రతో బాది హత్య చేశాడు. గ్రామానికి చెందిన దెయ్యాల కృష్ణయ్య, కూతురు సరస్వతి (23)కి ఈ నెల 8వ తేదీన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పట్టణంలోని క్రిష్టియ‌న్‌పల్లి కాలనీకి చెందిన ఓ యువకుడితో పెళ్లి చేశారు. అయితే.. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న సరస్వతి ఈ నెల 23వ తేదీన పుట్టింటికి వచ్చింది. తిరిగి కాపురానికి వెళ్లాలని కృష్ణయ్య ఎంత చెప్పిన విన‌లేదు. పైగా తల్లికూతురుకు అండగా ఉంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేయలేదని తీవ్ర మనస్తాపానికి లోనై సోమవారం అర్ధరాత్రి అతిగా మద్యం తాగి ఇంటికొచ్చాడు. గాడంగా నిద్రలో ఉన్న భార్య కళమ్మ(46), కూతురు సరస్వతిని కర్రతో తలపై బలంగా కొట్టి చంపేశాడు.

ఆపై తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడ్డ తల్లి కూతుళ్లు గట్టిగా అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చారు. ఇంటి త‌లుపులు తెరచి చూడగా కళమ్మ, సరస్వతి రక్తపు మడుగులో ప‌డి ఉన్నారు. ఆ పక్కనే కృష్ణయ్య కూడా ప్రాణాలతో కోట్టుమిట్టాడుతూ ఉండ‌డాన్ని గమనించిన స్థానికులు హూటాహుటీనా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైనా తల్లి కూతురును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండ‌గా మార్గ మధ్య‌లో ఇద్ద‌రూ చ‌నిపోయారు. కృష్ణయ్య జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement