Sunday, April 28, 2024

Telangana – రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’.. రేవంత్ కేబినెట్ ఆమోదం

హైదరాబాద్‌: రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని, ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌ను టీజీగా మార్చాలని, అలాగే.. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే అయిదు వంద‌ల‌కే గ్యాస్ సిలిండ‌ర్, 200 యూనిట్లు విద్యుత్ ప్రీ ప‌థ‌కాల‌పై కూడా క్యాబినేట్ చ‌ర్చించింది.. ఈ నెల‌లో ఈ రెండు ప‌థ‌కాల అమ‌లున‌కు కార్య‌చ‌ర‌ణ‌కు ఆమోద ముద్ర వేసింది క్యాబినేట్

నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై కమిటీతో రేవంత్ చర్చ

రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు. ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు. మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏమేం చేయాలి, ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు సూచనలను అందించాలని రేవంత్ రెడ్డి కమిటీకి సూచించారు. నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుదామని సీఎం అన్నారు.

చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు తో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, శ్రీ రోహిత్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఏ. చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement