Saturday, May 18, 2024

సామాన్యుడి కోస‌మే టెక్నాల‌జీ…సిఎం కెసిఆర్ కోరిక ఇదే

హైదరాబాద్‌, : బయో ఆసియా సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని, కరోనా అన్ని రంగాల్లో డిజిటల్‌ విప్లవాన్ని తీసుకొచ్చిందని ప్రపంచలోనే అత్యంత విలువైన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మైక్రో సాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. క్లౌడ్‌ లాంటి కొత్త తరం సాంకేతికత లేకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకత ఎలా ఉండేదో ఊహించు కోవడానికే వీలులేని పరిస్థితి ఉందన్నారు. బయో ఆసియా సదస్సు-2021 రెండోరోజైన మంగళవారం వర్చువల్‌ పద్ధతిలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చ- 2021 అనే ప్రత్యేక చాట్‌లో పాల్గొని ముచ్చటించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ అడిగిన పలు ప్రశ్నలకు సత్యనాదెళ్ల సమాధానమిచ్చారు. ‘కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం ప్రారంభించిన తర్వాత మేము అడాప్టివ్‌ బయోటెక్‌ కంపెనీతో కలిసి పనిచేశాం. ఇమ్యూన్‌ వ్యవస్థ వైరస్‌పై ఎలా పనిచేస్తుందో తెలుసుకుని తద్వారా కొత్త వ్యాక్సిన్‌లను ఆవిష్కరించడం సులభంగా మారింది. మ్యానుఫ్యాక్చరింగ్‌, హెల్త్‌ కేర్‌, రిటైల్‌ రంగాల్లో డిజిటల్‌ విప్లవాన్ని తీసుకొచ్చింది. హెల్త్‌కేర్‌లో ప్రొడక్టివిటీ డిజిటల్‌ వల్లే సాధ్యమైంది. అవుట్‌ పేషెంట్‌ విజిట్‌కు తొలుత మొబైల్‌ యాప్‌లో అపాయింట్‌మెంట్‌ రిక్వెస్ట్‌ పెట్టుకొని, తర్వాత టెలి మెడిసిన్‌, ఆ తర్వాత అవసరమైతే వార్డుకు వెళ్లే విధంగా కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత ఉపయోగపడుతోంది. తద్వారా ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌పై భారన్ని తగ్గించగలుగుతున్నాం. ఫిజిషీయన్‌ల సమయాన్ని ఆదా చేస్తున్నాం’ అని కేటీఆర్‌ అడిగిన కరోనా తీసుకువచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి అని అడిగిన ప్రశ్నకు సత్యనాదెళ్ల సమాధానమిచారు. దీనికి స్పందించిన కేటీఆర్‌ సీఎం కేసీఆర్‌ సాంకేతికత సామాన్యునికి ఉపయోగపడాలని ఎప్పుడూ చెబుతుంటారని పేర్కొన్నారు. అనంతరం కరోనాతో వచ్చిన మార్పుల్లో ఒకటైన కొత్త తరహా వర్చువల్‌ వర్కింగ్‌, వర్కింగ్‌ ఫ్రం హోం లాంటివాటిపై సత్యనాదెళ్లను కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘పనిచేసే సమయం, పనిచేసే స్థలం పట్ల రానున్న రోజుల్లో మరింత సడలింపులు ఉండే అవకాశముంది. వర్క్‌ ఫ్రం హోం విధానంలో పనిచేస్తూ డేటా సాంకేతికత ద్వారా ఇతరులతో సహకారాన్ని ఇచ్చి పుచ్చుకుంటూ పనిచేయాల్సి ఉంటుందన్నారు. కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది ప్యాండమిక్‌లో తప్పనిసరి విషయంగా మానవాళి ముందుకొచ్చింది.
ఏ సంస్థ అయినా ఎల్లప్పుడూ నేర్చుకుంటేనే గొప్పగా రాణిస్తోంది. కొల్లాబరేషన్‌, వెర్నింగ్‌ అనేవి వర్క్‌ ఫ్రమ్‌ వర్చువల్‌, ఫ్రం హోం విధానాలలో చాలా ముఖ్యం అని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. అనంతరం కేటీఆర్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ మధ్య స్టార్టప్‌ల మధ్య చర్చ జరిగింది. అయిదు సంవత్సరాల క్రితం టీహబ్‌ సందర్శించిన సందర్భం నాకింకా గుర్తుంది. కంప్యూటింగ్‌కు బయాలజీని జత చేసి కొత్త ఔషధాలు, వ్యాక్సిన్‌లను కనుగొనడం చాలా గొప్ప విషయం. స్టార్టప్‌ల వల్లే ఎన్నో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. స్టార్టప్‌లు ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్నాయి. క్లినికల్‌ ట్రయల్స్‌లో టెక్నాలజీ ఎంతో కీలకంగా మారింది. అపోలో హాస్పిటల్‌ 24 గంటలు తమ కార్యకాలాపాల్లో టెక్నాలజీని వాడుతోంది. మెడికల్‌ అదేరేన్స్‌ టెక్నాలజీ అనేది చాలా మార్పులు తీసుకువస్తోంది. పేషెంట్‌ కేర్‌, డ్రగ్‌ డిస్కవరీ విభాగాల్లో స్టార్టప్‌లు కొత్తవిప్లవాన్ని తీసుకొస్తున్నాయి’ అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. దీనికి స్పందించిన కేటీఆర్‌ టీ హబ్‌ గొప్పగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోందని, మళ్లిd హైదరాబాద్‌ వచ్చినపుడు తప్పకుండా టీ హబ్‌కు రావాలని సత్యనాదెళ్లను ఆహ్వానించారు. తన 15 ఏళ్ల కొడుకు ఇటీవల కొత్త రకం సాంకేతికత బూట్లు కొన్నాడని, అవి మనమెంత వేగంతో నడుస్తున్నాం, ఎంత దూరం వెళ్లామన్నది అన్ని తెలియజేసే విధంగా తయారుచేశారని, ఈ డేటా అంతా భద్రంగా ఉండాలంటే డేటా ప్రైవసీ నిబంధనల పాత్ర ఎలా ఉండాలని అని కేటీఆర్‌ నాదెళ్లను ప్రశ్నించారు. టెక్నాలజీ మనుషుల జీవితాల్లో భాగమైంది. ఇంటర్నెట్‌ సేఫ్టీ మా కంపెనీ ఇప్పటికే కసరత్తు చేస్తోంది.డేటా ప్రొటెక్షన్‌కు సంబంధించి ఇప్పటికే యూరప్‌లో చట్టాలు వచ్చాయి. మా కంపెనీ డాటా ప్రైవసీ, ఏఐ ఎథిక్స్‌ లాంటివన్న ఖచ్చితంగా పాటిస్తుంది. ఎన్నో నిబంధనలు, చట్టాల మాదిరిగానే డేటా ప్రైవసీ చట్టాలుండడం తప్పులేదు’ అని నాదెళ్ల సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో చర్చను ముగించిన కేటీఆర్‌, విలువైన సమయాన్ని కేటాయించి చర్చలో పాల్గొన్నందుకు సత్య నాదెళ్లకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement