Saturday, April 27, 2024

TS : రాజ‌న్న క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు….

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అన్ని శివాలయాల్లో శివరాత్రి రోజున శివ కళ్యాణం జరిగితే వేములవాడలో మాత్రం కామ దహనం అనంతరం త్రిరాత్రి ఉత్సవాలు నిర్వహించిన తర్వాత శివ కళ్యాణం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది.

- Advertisement -

ఇక, ఈ ఆలయంలోని స్వామి వారి కళ్యాణ మండపంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శర్మ నేతృత్వంలో అర్చకులు స్వస్తి పుణ్యహవాచనంతో ఉత్సవాలు వేద మంత్రాలతో ప్రారంభమయ్యాయి. పంచగవ్య మిశ్రణము, దీక్షాధారణము, బుత్విక్ వరణము, మంటప ప్రతిష్ట, గౌరి ప్రతిష్ట, నవ గ్రహ ప్రతిష్ట, అంకురార్పణ, వాస్తు హోమం, అగ్ని ప్రతిష్టతో పాటు శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు వేద పారాయణములు, పరివార దేవతార్చనలు నిర్వహించారు. శుక్రవారం నాడు అభిజిత్ లగ్న సుముహుర్తమున శ్రీ స్వామివారి కళ్యాణ మంటపంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.

అయితే, రేపు జరిగే శివ కళ్యాణాన్ని తిలకించేందుకు చైర్మన్ చాంబర్ ముందు ప్రత్యేకంగా కళ్యాణ మంటపం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని రంగు రంగుల పూలతో అందంగా అలంకరించారు. గోపురాలను విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి ముస్తాబు చేశారు. అలాగే ప్రత్యేకంగా చలువ పందిళ్ళు, తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement