Thursday, April 25, 2024

TS: ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం అందించాలి.. మాజీ మంత్రి కొప్పుల

పెద్దపల్లి (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సాగునీరు అందించక కర్షకుల ప్రాణాలను బలిగొంటున్నదని మాజీ మంత్రి, పెద్దపల్లి భారాసా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బుధవారం పెద్దపల్లి మండలం చీకురాయిలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… రైతు ప్రభుత్వమని చెప్పి రైతులను ఆగం చేస్తున్నదన్నారు. ఎండిపోయిన పంటలకు రైతులకు ఎకరాకు 25వేల రూపాయల పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులను మోసగించిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. రైతులు అన్నమో రామచంద్ర అంటున్న ప్రభుత్వానికి కనికరం లేదన్నారు.

రైతులు సచ్చిపోతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 50 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మూడు పిల్లర్లు కుంగితే దానిని సాకుగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండబెట్టి, సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీరు పెట్టిస్తోందన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వంద మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు క్వింటాలుకు 500రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు. రైతుభరోసా పథకం ద్వారా రైతులకు ఎకరాకు రూ.15,000ల సాయం, 2లక్షల రుణమాఫీ చేయాలన్నారు. రైతులను కన్నీరు పెట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధుకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement