Saturday, April 27, 2024

AP: రేవంతన్నా.. న్యాయం చేయన్నా!.. డీఎస్సీ 2008 బాధితుల విజ్ఞప్తి

ప్రజాభవన్ కు తరలివచ్చిన 500 మంది బాధితులు

స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదలబోమని బైఠాయింపు

వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఈనెల 8న సూచించిన హైకోర్టు

హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరుతున్న బాధితులు

- Advertisement -

హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ 2008 బాధిత అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. మంగళవారం దాదాపు 500మందికి పైగా అభ్యర్థులు ప్రజా భవన్ కు చేరుకున్నారు. 2008 డీఎస్సీలో నష్టపోయిన మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని గతనెల 8న రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని చెప్పారు. ఈ మేరకు తమకు నియామక ప్రక్రియ జరపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోపే 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం… తమ 15 ఏళ్ల కన్నీళ్లు తుడవాలని కోరుతున్నారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం…

2008లో నాటి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 6వ తేదీన 35వేల పోస్టుల్లో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులను కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని, బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని చెప్పింది. సుమారు 50రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29వ తేదీన జీవో నంబర్‌ 28ని తీసుకొచ్చింది. బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ కూడా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని సూచించింది. దీంతో నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం 2010 జూన్ 21న.. జీవో 27 ను విడుదల చేసింది. దీని ప్రకారం అధికారులు నియామక కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాల వారీగా కామన్ మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు.


2009 జూన్ 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా.. జూన్ 28న కౌన్సిలింగ్ పై స్టే విధించింది. జీవో 28 ప్రకారం 30శాతం కోటా కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో అధికారులు కౌన్సిలింగ్ నిలిపివేశారు. ఆ తర్వాత 30శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కొత్త మెరిట్ లిస్టు విడుదల చేసి 2010లో ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో మంచి మార్కులు సాధించినా ఉద్యోగం రాక ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 3500 మంది బీఈడీ అభ్యర్థుల కలలు కుప్పకూలిపోయాయి. ఇందులో తెలంగాణ అభ్యర్థులు 1200 మంది వరకు ఉన్నారు. అప్పటి నుంచి వారు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం చుట్టూ.. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ధర్నాలు, రాస్తా రోకోలు, నిరాహార దీక్షలు.. ఇలా అన్ని ప్రయత్నాలు చేశారు.

2013 జూలై 15న సుప్రీంకోర్టు బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2016 జనవరి 3వ తేదీన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బీఈడీ అభ్యర్థుల ప్రతినిధులను సచివాలయానికి పిలిపించుకున్నారు. కానీ హామీ అమలు చేయలేదు. ఆ తర్వాత వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలో కూడా నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 2017 ఫిబ్రవరి 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్ నేతృత్వంలోని బెంచ్, 27 సెప్టెంబర్ 2022న హైకోర్టు ధర్మాసనం బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. అయినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఏపీలో దాదాపు రెండున్నర సంవత్సరాల కింద డీఎస్సీ 2008 బాధితులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒకే నోటిఫికేషన్ లో బాధితులు ఒక రాష్ట్రంలో ఉద్యోగాల్లో ఉండడం, ఒక రాష్ట్రంలో న్యాయం కోసం ఎదురుచూడడం సరికాదని, గతనెల 8వ తేదీన రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. డీఎస్సీ 2008 బాధితుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం ఖాళీల్లో వారిని భర్తీ చేయండి లేదా.. నష్టపోయిన బీఎడ్ అభ్యర్థులకు ఏపీలో మాదిరిగా కనీసం కాంట్రాక్ట్ పద్దతిలో అయినా ఉద్యోగాలు ఇవ్వండని ఆదేశించింది. తాజా తీర్పు ప్రకారం ఏపీలో మరో 50 మందికి పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 15 సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని.. CM రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement