Thursday, May 2, 2024

పిడుగుపాటుకు ఆవు.. దూడ మృతి

పరిగి ( ప్రభ న్యూస్ ) నియోజకవర్గం లో భారీ గాలి వాన, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో పలు గ్రామాల్లో పిడుగులు పడ్డాయి. దోమ మండల పరిధిలోని ఖమ్మం నాచారం గ్రామంలో పిడుగుపాటుకు ఆవు దూడ మృతి చెందాయి. గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటయ్య అనే పేద రైతు పాలు ఇచ్చే ఆవు దూడను పొలం దగ్గర చెట్టుకు కట్టి వేయడంతో అనుకోకుండా పడిన భారీ వర్షంతో పిడుగు పడి ఆవు, దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. పాలిచ్చే ఆవు దూడ మృతి చెందడంతో రైతుకు సుమారు 60 వేల నష్టం జరిగింది. దీంతో రైతు వెంకటయ్య కన్నీరు, మున్నీరవుతున్నారు. పేద రైతు వెంకటయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధిత రైతుకు న్యాయం జరిగేలా చూస్తానని గ్రామ సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దొరశెట్టి శాంత కుమార్,నాయకులు బండి యాదయ్య, బి శ్రీశైలం, ఉప సర్పంచ్ రమేష్, బి నర్సింలు తదితరులు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement