Saturday, May 4, 2024

పండుగలా రైతుబంధు.. తొలిరోజు 19.98 లక్షల మందికి అందిన రూ.586కోట్ల సాయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రైతుల కళ్ల్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సీఎం కేసీఆర్‌ ఆడిన మాట మేరకు రైతులకు మేలు చేసే రైతుబంధు పథకం 9వ విడత రైతుల దరి చేరింది. వ్యవసాయం పండగ చేసేందుకు కంకణబద్దులైన సీఎం కేసీఆర్‌ కల ఫలిస్తోంది. రైతాంగానికి పెట్టుబడి సాయంతో స్వర్ణయుగానికి పునాది పడింది. సన్నకారు రైతులకు ఇకపై పంటసాగుకు వడ్డీ వ్యాపారులను, మనీలెండర్స్‌ను ఆశ్రయించే దుస్థితికి చరమగీతం పడింది. కాల్‌మనీ వ్యాపారుల కబంధ హస్తాలనుంచి రైతాంగాన్ని విముక్తం చేసేందుకు తెలంగాణ సర్కార్‌ దేశంలోనే చారిత్రాత్మకంగా అందిస్తున్న రైతుబంధు 9వ విడత నగదు జమ మంగళవారం ఆరంభమైంది. తద్వారా రాష్ట్రంలోని 1.53కోట్ల ఎకరాల్లో సాగుతో పచ్చగా కళకళలాడేందుకు సర్కార్‌ సాయం ఊతంగా నిల్వనుంది. తొలివిడతగా రైతుబంధు సాయంకింద మంగళవారం ఎకరం లోపు రైతులకు ఖాతాల్లో నిధులను జమ చేసింది. వానాకాలం సీజన్‌లో రూ. 7508 కోట్లను చెల్లించనుంది.

ఈరోజు (మంగళవారం) ఉదయం 11 గంటలనుంచే రైతుబంధు నిధుల అందజేత ప్రారంభమైంది. తొలిరోజు ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న రైతులకు రైతుబంధు సాయం జమ చేయగా, బుధవారంనుంచి వరుసగా రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. 68.94లక్షల మంది రైతాంగానికి వరుస క్రమంలో నిధులు అందనున్నాయి. ఈ దఫా కొత్తగా 3.64లక్షల మంది కొత్త రైతులు రైతుబంధును అందుకుంటున్నారు. రైతుబంధు ఖాతాలో 1.5లక్షల ఎకరాల వ్యవసాయ భూమి వచ్చి చేరింది. మంగ‌ళ‌వారంనాడు 19.98 లక్షల మంది ఎకరంలోపు భూమి కల్గిన రైతులకు రూ.586.65కోట్లను ప్రభుత్వం వారివారి ఖాతాల్లో జమ చేసింది. ఈ నేపథ్యంలో రైతుల్లో ఆనందం వెళ్లివిరిసింది. 11.73లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం తొలిరోజు అందింది. దీంతో సాగు పనులు జోరందుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వానలు కురుస్తుండటం, ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేత ఆరంభించడంతో ఇక రైతాంగం పొలాం బాట పట్టనుంది. రూ.7508 కోట్ల నిధులను ప్రభుత్వం కోటి 53లక్షల 44వేల 486 ఎకరాలకు అందిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement