Sunday, April 28, 2024

రఘునందన్ రావు ఆరోపణలు అవివేకం.. మంత్రి నిరంజ‌న్ రెడ్డి

ర‌ఘునంద‌న్ రావు చేసిన ఆరోపణలు అవివేకమైనవని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. త‌మ‌ స్వగ్రామం పాన్ గల్ లో త‌నకు ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నవే .. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది త‌న సతీమణి సొంత డబ్బులు, బ్యాంకులోనుతో కట్టుకున్న ఇల్లు అన్నారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి. విదేశాల్లో చదువుకుని, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మేజర్లు అయిన త‌మ ఇద్దరు అమ్మాయిలు స్వార్జితంతో చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుండి, ఇతరుల నుండి చట్టబద్దంగా భూములు ఖరీదు చేశారు.. ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకున్నారని రఘునందన్ రావు ఆరోపించారు.

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, ఏదో రంధ్రాన్వేషణ చేసినట్లు తొలుత భూములు కొని ఎస్టీల పేరు మీదకు.. తర్వాత మంత్రి కుటుంబ సభ్యుల పేరు మీదకు వెళ్లాయని రఘునందన్ రావు అన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ… తల్లితండ్రులను కోల్పోయిన పసిబాలుడు గౌడ నాయక్ ను చేరదీసి ఇంట్లో పెట్టుకుని పెంచి పెద్దచేసి ఉన్నత చదువులు చదివించింది వనపర్తి నియోజకవర్గం అంతా తెలుసు.. తాను త‌మ కుటుంబసభ్యుడే.. ప్రస్తుతం ఇంటి వ్యవహారాలు చూసుకునేది అతడేన‌న్నారు. భూములు కొన్న వారితో అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితుల్లో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్టర్ చేసి తర్వాత పిల్లల పేరు మీదకు మార్చుకోవడం జరిగిందన్నారు. కనీస సమాచారం లేకుండా రఘునందన్ రావు గుడ్డి ఆరోపణలు చేయడం అవివేకం .. దురుద్దేశపూర్వక ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తామ‌న్నారు.

మూడు ఫాంహౌజ్ లు ఉన్నాయని ప్రచారం చేయడం అవివేకమ‌న్నారు. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌజ్ లుగా కనిపిస్తే అది నీ అజ్ఞానానికి నిదర్శనమ‌న్నారు. పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి అని ఆరోపించారు.. కానీ అది వెల్టూరు గ్రామ పరిధి …. అక్కడ లండన్ లో డాక్టర్ గా పనిచేస్తున్న త‌న సొంత మరదలు కవిత, వారి స్నేహితులకు ఉన్న భూమి 11.20 ఎకరాలు మాత్రమేన‌న్నారు. అక్కడ ఫాంహౌజ్ లేదు.. కూరగాయల తోటలున్నాయ‌న్నారు. దానికి ప్రభుత్వం నుండి ఆ భూమికి ఏ రహదారి మంజూరు కాలేదు.. వారు ఇక్కడ ఉండరు కాబట్టి అప్పుడప్పుడు పర్యవేక్షణకు తాను వెళ్తుంటాన‌న్నారు. ఈ మూడు వ్యవసాయ క్షేత్రాలకు రఘునందన్ రావుకు నచ్చినవాళ్లతో, నచ్చిన సర్వేయర్ ను తీసుకుని రేపే వెళ్లొచ్చు.. లేదా, ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి సర్వే చేయించుకోవడానికి అంగీకరిస్తున్నానన్నారు. న్యాయంగా చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను త‌మ పిల్లలు వదిలేస్తారన్నారు .. తాను త‌న పదవికి రాజీనామా చేస్తానన‌ని, లేకుంటే నువ్వు అక్కడే నీ పదవికి రాజీనామా చేసిపోవాలని స‌వాల్ విసిరారు.

- Advertisement -


తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం సంఘటనను ఈ భూములకు ముడిపెట్టడం నీచపు ఆరోపణ అన్నారు. జుగుప్సాకరం .. రికార్డులు మండలస్థాయిలోనే కాదు జిల్లా స్థాయిలో, సీసీఎల్ఎ లో కూడా ఉంటాయని, ఒకచోట రికార్డులు లేకుంటే మరో కార్యాలయంలో ఉంటాయన్న కనీస పరిజ్ఞానం లేకపోతే ఎలా ? అన్నారు. రఘునందన్ రావును ఎవరు ఆడిస్తున్నారో త‌మకు తెలుసు .. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు వేరు వేరు కాదు .. రెండు ఒక తాను ముక్కలేన‌ని.. వారి ఎజెండా, కార్యాచరణ ఒక్కటే అని ప్రజలకు తెలుసన్నారు. చాలా ప్రయత్నాలు చేసి త‌న నియోజకవర్గంలో కొందరిని లోబర్చుకుని వ్యతిరేక కార్యకలాపాలు మొదలుపెట్టారన్నారు. రాజకీయంగా ఎదుర్కునే శక్తి లేక బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారు .. గత ఎన్నికలలోనూ ఇటువంటి ప్రచారమే చేశారు.. ఇప్పుడు అదే మొదలుపెట్టారన్నారు. 40 ఏళ్ల న్యాయవాద, రాజకీయ చరిత్రలో అక్రమాలకు, తప్పుడు చర్యలకు పాల్పడలేదన్నారు. రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణ చెప్పాలి.. చట్టబద్ధమైన చర్యలకు సిద్దంగా ఉండాలన్నారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నిరంజన్ రెడ్డి భయపడరు.. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించి ప్రజల్లో అభాసుపాలు చేయాలనుకోవడం అవివేకమ‌న్నారు. రఘునందన్ రావు తనను తాను ఎక్కువ ఊహించుకుని ఆరోపణలు చేస్తే ఇక్కడ భరించడానికి ఎవరూ సిద్దంగా లేరన్నారు. 1985 నుండే ఆదాయపు పన్ను చెల్లించిన న్యాయవాదిని తానని, స్థాయిని మించి మాట్లాడేటప్పుడు రఘునందన్ రావు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా రాజకీయ దుగ్దతో చేసిన ఆరోపణలకు రఘునందన్ రావు క్షమాపణ చెప్పాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement