Sunday, April 28, 2024

రాబోవు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి… వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్

రానున్న శాసనసభ ఎన్నికల నిర్వహణకు పోలీసు అధికారులు సన్నద్ధం కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ వీ రంగనాథ్ పిలుపునిచ్చారు. నెలవారి నేర సమీక్షలో భాగంగా శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ వరంగల్ కమిషనరేట్ పోలీసు అధికారులతో కాజీపేటలోని నిట్ సమావేశ ప్రాంగణంలో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. డిసిపిలు, అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఇన్స్స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా ఆదివారం నిర్వహించబడే గ్రూప్ 4 పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు, పరీక్షలు నిర్వహించబడే కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ క్రైమ్స్ డిసిపి మురళీధరు ను అడిగి తెలుసుకోవడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో పరీక్షా కేంద్రాల వద్ద తగురీతిలో భద్రత ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పరీక్షకు హజరయ్యే అభ్యర్ధులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.

అనంతరం రానున్న ఎన్నికలపై పోలీస్ కమిషనర్ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడిన వారితో పాటు గతంలో ఎన్నిక సందర్భంగా నేరాలకు పాల్పడిన వ్యక్తులను బైండోవర్ చేయాలని, డబ్బు, మద్యం, గంజాయి రవాణాతో పాటు బెల్ట్ షాపులపై అధికారులు నజర్ పెట్టాలని, స్టేషన్ పరిధిలో గతంలో నేరాలకు పాల్పడిన లేదా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వ్యక్తుల సమచారం సేకరించాలని, ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టాలని పోలీస్ అధికారులకు తెలిపారు. సాధారణ పోలీస్ విధులపై పోలీస్ కమిషనర్ అధికారులతో ప్రస్తావిస్తూ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ, నైపుణ్యంతో కూడిన దర్యాప్తు కొనసాగించాలని, ముఖ్యంగా కీలకమైన కేసుల్లో సాక్షుల వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేయాల్సిన అవసరం వుందని, నేరస్తులకు శిక్ష పడేందుకు దర్యాప్తు అధికారులు ఖచ్చితమైన సాక్ష్యాధారాలను అందజేయాలని తెలిపారు. అలాగే అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసుల్లో దర్యాప్తు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ లోతుగా దర్యాప్తు చేయాలని, విధుల్లో భాగంగా అధికారులు సవాళ్ళను స్వీకరిస్తూ ఒత్తిళ్ళను అధిగమిస్తూ విధులు నిర్వహించి, నిరుపేద వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో క్రైమ్స్ డిసిపి మురళీధర్, ఈస్ట్, వెస్ట్ జోన్ డిసిపిలు కరుణాకర్, సీతారాం, ట్రైనీ ఐపిఎస్ అంకిత్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు.


పోలీస్ కమిషనరేట్ పాత వాహన విడిభాగాల వేలం :
వరంగల్ పోలీస్ కమిషనరేట్ మోటార్ ట్రాన్స్ పోర్ట్ లో పాత వాహనాలకు సంబంధించిన మరమ్మత్తులు చేసిన వాహన విడిభాగలు, టైర్లు, బ్యాటరీలను రేపు అనగా జులై ఒకటవ తేదిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని మోటార్ విభాగం ప్రాంగణంలో ఉదయం పది గంటలకు వేలం నిర్వహించబడును. ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు ఈ వేలంగా పాల్గొనవచ్చని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement