Sunday, May 5, 2024

Morthad: పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన.. మంత్రి వేముల

మోర్తాడ్, జూలై 1(పభ న్యూస్) : పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అబివృద్దికి ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ కు చెందిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తీగల సంతోష్ అతని అనుచరులు హైదరాబాద్ లో శనివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… బాల్కొండ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో అన్నివిధాలా అభివృద్ది చేసుకున్నామని మంత్రి అన్నారు. సాగునీటి రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, మౌళిక సదుపాయాల కల్పన, మెరుగైన వైద్య సేవలు, బి.టి రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, సంక్షేమ పథకాలతో బాల్కొండ నియోజకవర్గం సుభిక్షమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఈ సందర్బంగా చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రపంచ స్థాయి ప్రశంసలు అందుతున్నాయని, అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఎదిగిందన్నారు. రోజు రోజుకు దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ అభివృద్ది కావాలనే డిమాండ్ పెరుగుతోందన్నారు.

- Advertisement -

అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటూ దేశ మార్పు కోసం బయలుదేరిన కేసీఆర్ కు ప్రజల్లోంచి విశేష మద్దతు లభిస్తోందని తెలిపారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ వల్ల 10 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీ వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పచ్చగున్న తెలంగాణ మీద బీజేపీ విషం చిమ్ముతుందని, కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎవరెన్ని సర్కస్ ఫీట్లు వేసినీ.. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు. ఏది ఏమైనా కేసీఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని మంత్రి వేముల పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల జడ్పీటిసి బద్ధం రవి, ఎంపిపి శివలింగు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, ఉపాధ్యక్షుడు సుభాష్, సుంకెట్ సర్పంచ్ కడారి శ్రీనివాస్, ఉప సర్పంచ్ పృధ్వీ, గ్రామ శాఖ అధ్యక్షుడు కె.పరమేష్, బీఆర్ఎస్ నాయకులు సందీప్, పిట్ల సత్యం, మాజి ఎంపిటిసి నవీన్, కడారి రవి, ఆరిఫ్, సుంకేట్ వార్డు సభ్యుడు ఓంకార్, సొసైటీ వైస్ చైర్మన్ చిరంజీవి, కే.చిన్న రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement