Tuesday, May 14, 2024

FCI తీరుతో ఇబ్బందులు: మంత్రి గంగుల

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. వానాకాలం ఇబ్బందుల్ని అధిగమించి నిరంతరాయంగా కొనుగోళ్లు చేశామన్నారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతేడాది కంటే 30 శాతం అధికంగా ధాన్యం సేకరించామని మంత్రి చెప్పారు. రైతుల డబ్బు చెల్లింపులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఓపీఎంఎస్‌లో నమోదైన వెంటనే రైతులకు నగదు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.5447 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. 6775 కొనుగోలు కేంద్రాల్లో 1280 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఎఫ్‌సీఐ తీరుతోనే గోదాములు ఖాళీ లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. రైతులపై కేంద్రం, ఎఫ్‌సీఐ తీరు విచారకరమని మంత్రి గంగుల పేర్కొన్నారు.

ఇప్పటివరకూ 6775 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేపడుతున్నామని, నిన్నటి వరకూ 42.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసామన్నారు. వీటి విలువ 8,268 కోట్లన్నారు. ఒపీఎంఎస్లో నమోదైన 4 లక్షల 50వేల మంది రైతులకు గానూ 3 లక్షల 75వేల మందికి పేమెంట్ సైతం పూర్తి చేసామన్నారు. ట్రాన్స్ పోర్టు, గన్నీల కొరత లేదన్న మంత్రి.. కరోనా సంక్షోభంలోనూ వానాకాలం వడ్ల కొనుగోళ్లు నిరంతరాయంగా చేస్తున్నామన్నారు.

ఎఫ్.సి.ఐ గోదాములు తెలంగాణలో దాదాపుగా అన్నీ నిండిపోయాయని చెప్పారు. ముఖ్యంగా సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నిర్మల్లో గోదాములు పూర్తిగా నిండిపోయాయని మిగతా చోట్ల సైతం నిలువ కొరత వేదిస్తుందన్నారు. ఎఫ్.సి.ఐ గోదాములను, గోడౌన్లను లీజుకు తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనికి తోడు సరైన సమయానికి ర్యాక్ లు పంపకపోవడంతో గోదాముల నుండి భియ్యం తరలింపు జరగడం లేదని, దీంతో మిల్లుల్లో ఉన్న బియ్యాన్ని ఎఫ్.సి.ఐ గోదాముల్లోకి తీసుకోలేకపోతుందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్.సి.ఐ కు విజ్ణాపన లేఖలు పంపిందన్నారు. అయితే, ఎలాంటి స్పందనా లేదన్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వానాకాలం ధాన్యం సేకరణను వేగవంతంగా చేస్తుందని మంత్రి గంగుల చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement