Sunday, May 5, 2024

విద్యా,ప‌రిశోధ‌న రంగాల‌లో సేవ‌ల కోసం జపాన్ కు చెందిన ‘సిట్’ తో ఉస్మానియా ఒప్పందం…

హైద‌రాబాద్ – విద్య, పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను పరస్పరం మెరుగు పరుచుకునే దిశగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ముందడుగు వేసింది. జపాన్ కు చెందిన షిబౌరా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(SIT) తో పరస్పర అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ మేరకు టోక్యోలోని షిబౌరా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SIT)… సకురా సైన్స్ ప్రోగ్రామ్ (SSP)లో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌ ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ ఒప్పందంపై సంతకం చేశారు. SIT నుంచి సంస్థ అధ్యక్షులు జన్ యమద, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ తకుమి మియోషీ ఒప్పందం పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రెండు విద్యాసంస్థల మధ్య అత్యాధునికి సాంకేతిక సౌకర్యాలు పంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులు, అధ్యాపకులు వారి విజ్ఞానం, వనరులు, అవకాశాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకునే వెసులుబాటు లభిస్తుంది.


సకురా సైన్స్ ప్రణాళికలో భాగంగా పది మంది ఓయూ విద్యార్థులతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్, విద్యార్థి సంక్షేమ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ రాజెంద్ర నాయక్ లు జపాన్ లో పర్యటిస్తున్నారు. ఏడు రోజుల పర్యటనలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు పరస్పర చర్చా కార్యక్రమాలతో పాటు, శాస్త్ర సాంకేతిక లాబోరేటరీలు, మ్యూజియం సందర్శన, సంస్కృతి సంప్రదాయాలపై మాటా మంతి తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనకు అవసరమయ్యే మొత్తం ఖర్చును శిబౌరా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భరిస్తోంది. విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ, వీసా, వసతి, స్థానిక రవాణా మొదలైనవాటిని సిట్‌లోని అంతర్జాతీయ విభాగం చూసుకుంటుంది. శిబౌరా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ప్రొఫెసర్ మురళీధర్ మిర్యాల ఓయూ నుంచి ప్రొఫెసర్ బి. రాజేంద్ర నాయక్ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement