Wednesday, May 8, 2024

Nizamabad Collector : రాష్ట్ర ప్రగతిలో మరింత మమేక‌మ‌వుదాం

నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గ కేంద్రాలలో సోమవారం నిర్వహించిన 2కె రన్ కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. సోమవారం జిల్లా కేంద్రంలో నగర నడిబొడ్డున గల ఫులాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా పోలీస్ పరేడ్ మైదానం వరకు కొనసాగింది. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి, విశిష్టతలను చాటేలా ఉదయం 7 గంటల సమయానికే వేలాది సంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్చందంగా హాజరై 2కె రన్ లో భాగస్వాములయ్యారు. జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ తోడ్పాటుతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరుగులో ఉద్యోగులు, విద్యార్థులు, యువతీ, యువకులు మొదలు వృద్దుల వరకు కదంకదం కలుపుతూ ఉత్సాహంగా పాల్గొనడం సమైక్యతకు అద్దంపట్టింది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించి సమకూర్చిన శ్వేతవర్ణపు టీ షర్టులను ధరించి వేలాది మంది 2కె రన్ లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బెలూన్లను గాలిలోకి ఎగురవేసి, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ దండు నీతు కిరణ్, అదనపు డీసీపీలు మధుసూదన్ రావు, గిరిరాజా, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ తదితరులంతా 2 కె రన్ లో భాగస్వాములయ్యారు. వీరితో పాటు అన్ని శాఖలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఎన్ సి సి, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, నర్సింగ్ కళాశాల, ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు, వైద్యులు, క్రీడా సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దశాబ్ది ఉత్సవ జెండాలను చేతబూని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.

ఫ్రీడమ్ ర్యాలీకి హాజరైన వారితో పోలీస్ పరేడ్ మైదానం కిక్కిరిసిపోయింది. 2కె రన్ ను ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ఆయా రంగాలలో తెలంగాణ సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ మరింత ఉత్సాహంగా ముందుకు సాగేలా ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. ఇందులో భాగంగా చేపట్టిన 2కె రన్ కు యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా తరలిరావడం ఎంతో సంతోషకరమని అన్నారు. దశాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రగతిలో మరింతగా మమేకం అవుదామని పిలుపునిచ్చారు. జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ,
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణాలో అన్ని వర్గాల వారి కోసం ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల తెలంగాణ అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గుర్తు చేశారు. కాగా, 2కె రన్ వంటి కార్యక్రమాలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని, యువత ఉత్సాహంగా భాగస్వాములు కావాలని సూచించారు. చక్కటి ఆరోగ్యం కోసం అనునిత్యం వాకింగ్, రన్నింగ్ , వ్యాయామాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement