Saturday, May 4, 2024

ర‌న్నింగ్ తో యువ‌త‌లో శారీర‌క దృఢ‌త్వం పెరుగుతుంది : కలెక్టర్ హేమంత్ సహదేవరావు

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రభ న్యూస్) : రన్నింగ్ పోటీలతో యువతలో శారీరక దృఢత్వం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అధ్యక్షతన ఏఆర్ హెడ్ క్వార్టర్స్ వద్ద నుండి ప్రారంభించిన 2.5 కే రన్ పోటీలకు అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పేయిలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. పోటీల అనంతరం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని ఈ పోటీలు దానికి ఉపయోగపడతాయన్నారు. పోలీసులు శారీరకంగా దృఢంగా  ఉండడం ఎంతో ముఖ్యమని, జిల్లాలో పోలీసులు అందరూ ఫిట్ గా ఉన్నారని దీనికి ఎస్పీ కృషి కూడా ఎంతో ఉందన్నారు. ఇలాంటి పరుగుపందెంలో యువతను పాల్గొనేలా చేయడం గొప్ప విషయమని అన్నారు. యువత ఇదే స్ఫూర్తిని ప్రతి పోటీలో కొనసాగించాలని సూచించారు. జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుందన్నారు. ప్రతిరోజు తప్పనిసరిగా యువత రన్నింగ్ చేయాలన్నారు. తాను ప్రతి రోజు తప్పకుండా 10 కిలోమీటర్లు పరిగెత్తుతానని తెలిపారు. జీవితంలో ఆస్తులు సంపాదించడం తేలికే కానీ ఆరోగ్యం సంపాదించడం కష్టమని యువత నుండి దానిని సాధించుకోవడానికి కృషి చేయాలన్నారు. 2.5 కె రన్ లో పాల్గొన్న యువతకు అభినందనలు తెలిపారు. అంతకుముందు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుండి ప్రారంభమైన 2.5 కె రన్ బస్టాండ్, చిల్డ్రన్ పార్క్ మీదుగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గాధవేని మల్లేష్, డి.ఎస్.పి శ్రీనివాస్, ఆసిఫాబాద్ సీఐ రాణా ప్రతాప్, డివిజన్ పరిధిలోని పోలీసులు, సిబ్బంది, యువత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement