Sunday, April 28, 2024

బీజేపీకి డిపాజిట్లు కూడా రావు : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై అడ్డగోలు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోము అని, నీతి మాలిన కామెంట్లు చేస్తున్న ఎంపీ అరవింద్ కు చెప్పులతో సత్కారం చేస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఆర్మూర్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “అరవింద్ ఒక సైకో, డ్రగ్స్ కు బానిస.. నిత్యం మత్తులో ఉంటాడు.. మామిడిపల్లి రైల్వే వంతెన తెచ్చింది నేను, 2017లో వంతెన మంజూరైనప్పుడు అరవింద్ ఎంపీ కూడా కాదన్నారు. మందికి పుట్టినోళ్లు మా వాళ్లే అనడం బీజేపీ నైజం అన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి రూ.3వేల కోట్లు తెచ్చాన‌ని గుర్తు చేశారు. ఎంపీగా ఎన్ని నిధులు తెచ్చావో చెప్పు, ఆర్మూర్ అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా? అని స‌వాల్ విసిరారు. ధైర్యం ఉంటే ఆర్మూర్ లో నా పై పోటీ చేసి గెలువు, అరవింద్ ఎక్కడ కనపడితే అక్కడ దంచి కొట్టుడే”అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆర్మూర్ ను రెవెన్యూ డివిజన్ గా మార్పించా, కొత్తగా ఆలూరు, డొంకేశ్వర్ మండలాలు చేయించా అన్నారు. కేసీఆర్ దార్శినిక పాలన వల్ల ప్రతీ ఇంట్లో సంక్షేమం.. ప్రతీ కంట్లో సంతోషం కనిపిస్తున్నద‌న్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితరుల వర్గాలకు రూ.2,016 చొప్పున, వికలాంగులకు రూ.3,016 చొప్పున ఆసరా పెన్షళ్ళు వస్తున్నాయి. 30 పడకల నుంచి వందపడకలకు మారిన ఆర్మూర్ ఆసుపత్రిలో ఇప్పటికే 20వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగాయి. నియోజకవర్గంలో వేలాదిమందికి సీఎం ఆర్ ఎఫ్, ఎల్ ఓ సీలు ఇప్పించా అన్నారు. కళ్యాణ లక్ష్మీ ద్వారా రూ.1,00,116లు ఇస్తూ పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేస్తున్నాం. రైతుబంధు ఏడాదికి ఎకరానికి రూ.10,000లు చొప్పున ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ. 50వేల కోట్ల రూపాయల కు పైగా పడ్డాయి.

రైతు బీమా కింద చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా సొమ్ము అందుతోంది. కేసీఆర్ కిట్లు రూ .12,000, ఆడపిల్ల పుడితే రూ.13,000లు ఇస్తున్నారు. మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి మంచి నీళ్ళు వస్తున్నాయి. మిషన్ కాకతీయ వల్ల చెరువులు బాగుపడి ఇంత కుండ పోత వర్షాలు పడుతున్నా చెక్కు చెదరకుండా జలకళ ఉట్టి పడుతున్నాయి. ఇరవై నాలుగంటల కరెంటు సరఫరా జరుగుతోంది. గురుకులాలు వచ్చాయి. ఒక్కో విద్యార్థి చదువుకు ఏడాదికి ఒక లక్షా 25వేల రూపాయల కు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. సిద్ధులగుట్టకు కొత్త వైభవం తెచ్చా. ఆర్మూర్ నియోజకవర్గంలో 17వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయించా.వంద మందికి దళితబంధు ఇప్పించా.అన్ని వర్గాల వారికి భూములు కేటాయించి ఫంక్షన్ హాల్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించా. ఎంపీ గా అరవింద్ ఏం చేసాడు?. ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధమా?.నీ అయ్య టీఆర్ ఎస్ పెట్టిన భిక్షతోనే బతుకుతుండు. నీ అయ్య 40 ఏండ్లు రాజకీయాల్లో ఉన్న అరవింద్ ఎవరూ గుర్తు పట్టారు. కొత్త బిచ్చగాడు మాదిరిగా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న అరవింద్ ను మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి. అరవింద్ బతుకు అవినీతి మాయం. 18 ముంపు గ్రామాల ప్రజల కోసం కొట్లాడిందే నేను. సిగ్గు, సోయి లేకుండా మాట్లాడుతున్న అరవింద్ ను జిల్లాలో తిరగనివ్వం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ ఎవర్ గ్రీన్ సీఎం – బండి సంజయ్ ది చిలక జ్యోస్యం
సీఎం కేసీఆర్ పై ,టీఆర్ ఎస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి మండి పడ్డారు. కేసీఆర్ ఔట్ డేటెడ్ సీఎం కాదని ,ఎవర్ గ్రీన్ సీఎం అని ఆయన స్పష్టం చేశారు .వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు 15 సీట్లే వస్తాయని బండి సంజయ్ చిలక జ్యోతిష్యాలు చెప్పుతున్నారని ఆయన పేర్కొంటూ అసలు బీజేపీకి 15సీట్లలో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. బండి సంజయ్ నోటి దురుసు తగ్గించు కుంటే మంచిదన్నారు. సీఎం కేసీఆర్ పై,మంత్రి కేటీఆర్ పై బీజేపీ నాయకులు నోరూపారేసుకుంటే సహించేది లేదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement