Friday, April 26, 2024

న‌న్న‌ప‌నేని సూప‌ర్ స‌క్సెస్…

వరంగల్‌ నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయకేతనం…
ఫలించిన ఆరు మాసాల వ్యూహం, ప్రణాళిక

వరంగల్ – వరంగల్‌ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు, మాజీ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో అభర్ధుల విజయానికి వేసిన స్కెచ్‌ విజయవంతమైంది. తన నియోజక వర్గ పరిధిలో 24 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 20 డివిజన్లను గెలిపించి ఆయన సత్తా చాటారు. అత్యధిక డివిజన్లలో పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులను గెలిపించిన నన్నపునేని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబె ట్టారు. పురపాలిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో పాద యాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకోవ డంతో పాటు వాటిని అక్కడికక్కడే అధికారులను పిలిపించి పరిష్కరించారు. అభ్యర్థుల ఎంపిక మొదలు పోలింగ్‌ ముగిసి ఫలితాలను ప్రకటించే వరకు అంతా తానై వ్యవహరించారు. కోవిడ్‌ మహమ్మారి రెండో దశ విజృంభిస్తున్నా, భానుడు భగ భగ లాడుతున్నా ఏ మాత్రం లెక్కచేయక అధినేతకు ఇచ్చిన హామీ మేరకు నరేందర్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. విపక్ష పార్టీలకు ఆ పార్టీల తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు నరేందర్‌ ఎన్నికల ప్రచార సందర్భంగా ముచ్చెమటలు పట్టించారు . ఆది నుంచి పార్టీ పట్ల నిబద్దత, క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో పనిచేయడంతో పాటు తెరాస అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన ఆదేశాలను, చేసిన సూచనలను తూచా తప్పకుండా అమలు చేసి పార్టీ అభర్థులను విజయతీరాలకు తీసుకువెళ్లారు. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అంతకు ముందు జరిగిన హుజూరునగర్‌ ఉపఎన్నికలు, ములుగు జిల్లా పరిషత్‌, మహబూబాబాద్‌ నగర పాలక సంస్థ ఎన్నికల్లో నరేందర్‌ వేసిన ప్రణాళికలు ఫలించడంతో పాటు అక్కడ ఇతర పార్టీల అభ్యర్థులకు అంతుపట్టని విధంగా వ్యూహాలను రచించి అమలు చేసిన దిట్టగా నరేందర్‌ కు పేరుంది. ఎక్కడ ఎటువంటి ఎన్నిక జరిగినా అక్కడి స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి ప్రణాళిక వ్యూహం రచించడంలో నరేందరుకు సాటి ఎవ్వరూ లేరన్న ప్రచారం పార్టీ లో ఉంది. అందుకే ఎన్నిక ఏదయినా ఎక్కడైనా జరిగితే అక్కడికి నరేందర్‌ ను పార్టీ అధినేత కేసీఆర్‌ ఎంపిక చేయడంతో పాటు అక్కడి పూర్తి ప్రచార బాధ్యతలను అప్పగిస్తుంటారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థి పళ్ళా రాజేశ్వర్‌ రెడ్డి విజయానికి ఆయన విశేష కృషి చేశారు.
ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఎంతో దోహదపడ్డాయని నరేందర్‌ చెప్పారు. వరంగల్‌ ను దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నగర అభివృద్ధికి 2,500 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని భవిష్యత్తులో భారీ ఎత్తున నిధులను సమకూర్చి సుందర పర్యాటక నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీ కార్పోరేటర్లను ఆయన అభినందించారు. వరంగల్‌ మహా నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా పని చేయాలని ఈ నగరాన్ని అగ్రగామిగా తీర్చి దిద్దాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement