Friday, May 24, 2024

రాష్ట్రాన్ని దివాలా తీసిన సీఎం కేసీఆర్ : ప్రజా ప్రస్థానంలో వైఎస్ షర్మిల‌

యాదాద్రి : సీఎం కేసీఆర్ నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాలా తీశారని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానంలో భాగంగా 25వరోజు షర్మిల‌ నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. పెద్దసంఖ్యలో జనం తరలిరాగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. రామన్నపేట గ్రామంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమై, సమస్యలు తెలుసుకున్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువతీ యువకులను పలకరించి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. రైతులు కోటీశ్వర్లు అయ్యారు. కార్లల్లో తిరుగుతున్నారని కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని, రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని చెప్పారు. మహిళలు ఇల్లు నడిపించేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. పూట గడవక పస్తులుంటున్నారని చెప్పారు. ప్రజల కష్టాలు కండ్లకు కనిపించడం లేదని, రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా, కేసీఆర్ ఒక్క కుటుంబానికి కూడా భరోసా ఇవ్వలేదన్నారు. న‌కిరేకల్ సమీప హైవేపై ఎన్నో ప్రమాదాలు జరిగి, ప్రజలు చనిపోతున్నా.. కాళ్లు, చేతులు విరుగుతున్నా.. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదన్నారు. రాష్ట్రంలో పాలకులు గానీ ప్రతిపక్షం గానీ ప్రజల తరఫున ఆలోచన చేయడం లేదని, అందుకే వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన ప్రజా గొంతును వినిపిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement