Friday, April 26, 2024

గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ‍‍ – మంత్రి సత్యవతి రాథోడ్

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి = గిరిజన సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నాడని,ప్రతి గిరిజన తండా అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందని గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండల కేంద్రంలో ఏర్పటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో త్వరలో రెండు కోట్లతో సంత్ సేవ సేవాలాల్ భవన్ తో పాటు నూతన గిరిజన గురుకులానికి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 3,144 తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో పాటు, రూ.2వేల కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు వేయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. బీజేపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే నని,బీఆర్ఎస్ పార్టీ చేతల ప్రభుత్వమన్నారు.
మా తండాలో మా రాజ్యం అనే నినాదాన్ని సాకారం చేసిన ఘనత గౌరవ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

ఆలేరు నియోజకవర్గంలోని తండాలకు రూ. 11 కోట్ల 21లక్షలు మంజూరు చేశామన్నారు. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు.
కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.బీజేపీ నాయకులు గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని,ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ 10శాతం పెంచి గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని మరింత బలోపేతం చేసి మరోసారి రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వ పాలనను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంతకు ముందు పలు బీటీ రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, టేస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ట్రైకర్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement