Monday, May 6, 2024

NZB: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో జిల్లా అధికారుల భేటీ

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 20 (ప్రభ న్యూస్): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథితో నిజామాబాద్ జిల్లా ఉన్నతాధికారులు బుధవారం భేటీ అయ్యారు. పొరుగునే ఉన్న నిర్మల్ జిల్లా బాసరలో గల ట్రిపుల్ ఐ.టీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రేరణ కల్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బుధవారం బయలుదేరి వెళ్తూ, మార్గమధ్యంలో గల నిజామాబాద్ రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహంలో కొద్దిసేపు బస చేశారు.

ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, అదనపు డీసీపీ జయరాం, జెడ్పి సీఈఓ గోవింద్ తదితరులు స్వాగతం పలికి కమిషనర్ పార్థసారథితో భేటీ అయ్యారు. పలు అంశాలపై జిల్లా అధికారులతో చర్చించిన కమిషనర్, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గెస్ట్ హౌజ్ కు చేరుకున్న కమిషనర్ పార్థసారథి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం బాసర ట్రిపుల్ ఐ.టీ లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement