Tuesday, May 7, 2024

రేక్ పాయింట్ జిల్లా ప్రజలకు వరం : మంత్రులు హ‌రీష్ రావు, నిరంజ‌న్ రెడ్డి

గ‌జ్వేల్ లో ఏర్పాటు చేసిన రెక్ పాయింట్ జిల్లా ప్రజలకు వరంగా మార‌నుంద‌ని మంత్రులు హ‌రీష్ రావు, నిరంజ‌న్ రెడ్డిలు అన్నారు. రేక్ పాయింట్ ప్రారంభించిన అనంత‌రం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..రేక్ పాయింట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు దశాబ్దాల పోరాట‌మ‌ని, రైల్వే లైన్ కేంద్రం బాధ్యత కానీ నేడు రైల్ రావడానికి కేంద్రం నిధులు తక్కువ, రాష్ట్ర నిధులు ఎక్కువ ఉన్నాయ‌న్నారు. నాటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలు నిధులు ఇచ్చేవారు కాద‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతు వాట ఎప్పటికప్పుడు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. కొత్తపల్లి – మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేసింది. ఈ లైన్ కోసం 2200 ఎకరాల భూ సేకరణ చేశామ‌న్నారు. ఈ రెక్ పాయింట్ జిల్లా ప్రజలకు వరంగా మార‌నుంద‌న్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామంటే, యాడికెళి ఇస్తావ్ అని నాటి కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నాడు ఈ రోజు అది నిజం అయ్యింద‌న్నారు. నీటి తీరువ రద్దు, పన్నులు రద్దు చేసిన ఘనత కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. రైతులకు నీళ్లు ఇచ్చినం, గౌడన్లు కట్టినం, చెరువులు బాగు చేసినం, ఎరువులు ఇస్తున్నామ‌న్నారు. రేపటి నుంచి రైతులకు రైతుబంధు 7500 కోట్లు ఖాతాల్లో పడుతున్నాయ‌న్నారు.

పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారు. బాయిల కాడ మీటర్లు పెట్టినందుకు రాష్ట్రానికి 25 వేళా కోట్లు రాకుండా పోయాయి.. అయినా రైతుల క్షేమమే ముఖ్యమని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మనము బాగవుతుంటే, అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక నిధులు అపుతున్నార‌న్నారు. గతంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా జై జవాన్, జై కిసాన్ అనే వారు.. నేడు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నై జవాన్, నై కిసాన్ అంటున్నది. మొన్న నల్ల చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలు తీస్తే, నేడు ఆర్మీలో కాంట్రాక్ట్ సిస్టమ్ తెచ్చి యువకుల ఉసురు తీస్తున్నారు. తెలంగాణకు వచ్చి బీజేపీ నేతలు ఎం చెబుతారు. నీతి ఆయోగ్ 24 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని చెప్పినా ఇవ్వలేదని చెబుతారా ? వరంగల్ కు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించుకు పోయి తెలంగాణకు అన్యాయం చేశామని చెబుతారా ? మా ఐటీఐఆర్ రద్దు చేశామని చెబుతారా ? వరి కొనుమని అంటే నూకలు తినమని చెప్పి అవమాన పరిచిన ప్రభుత్వం బీజేపీ ఏం చెబుతుంద‌న్నారు. మీరు హైదరాబాద్ కు వచ్చే లోపు వరి ధాన్యం ఎంత కొంటావో చెప్పి రావాల‌న్నారు. కేంద్రం కొంటానన్న రా రాయిస్ కూడా తీసుకోకుండా అన్యాయం చేస్తోందన్నారు.


మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అనేక రకాల ఎగుమతుల సౌలభ్యం ఈ రేక్ పాయింట్ ద్వారా అందనుంద‌ని, ప్రజల ఊహలకు అందనిది, కలలో కూడా ఉహించని అభివృద్ధి టిఆర్ఎస్ హయాంలో జరుగుతున్నది. రాబోయే వందల సంవత్సరాల వరకు ప్రజల అవసరాలు తీర్చే పనులు జరుగుతున్నాయ‌న్నారు. సీడ్ పాయింట్ గా గజ్వెల్ అభివృద్ధి చెందుతున్నన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement