Tuesday, May 14, 2024

MBNR: బాణ‌మతి నెపంతో మహిళాను హత్య

మహబూబ్‌న‌గర్(ప్రభ న్యూస్): పాత కక్ష్యలు దృష్టిలో ఉంచుకొని ఓ మహిళపై చేతబడి నెపం మోపి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చిన సంఘటన మహబూబ్ నగర్ మండల పరిధిలోని కోటకదిర గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబీకులు పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కోటకదిర గ్రామానికి చెందిన మేకల నాగమ్మ(40) అనే మహిళ భర్త కుమారులు మృతి చెందడంతో ఒంటరిగా గ్రామంలో నివసిస్తుండేది. తనకు వీలు చిక్కినప్పుడల్లా హైదరాబాదు నగరంలోని బేగం బజార్ లో నివాసం ఉండే తన కూతురు అచ్చమ్మ దగ్గరకు వెళ్లి వస్తుండేది. పాత కక్ష్యలు దృష్టిలో ఉంచుకొని ఆమె దాయాదులు తరచూ గొడవ పడేవారు.

ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలనే ఉద్దేశంతో సోమవారం గ్రామస్తులందరూ నిద్రలోకి జారుకుంటున్న సమయంలో ఆమె దాయాదులైన బడాల సత్తయ్య, ఆయన భార్య బడాల చంద్రమ్మ, మరో దాయాది చెన్నగళ్ళ నర్సమ్మలు ఇంట్లో నివసిస్తున్న మృతురాలు మేకల నాగమ్మ తో గొడవపడి ఆమెను ఇంట్లో నుంచి బయటకు లాగి కాళ్లతో విచక్షణ రహితంగా తన్ని వెంట తెచ్చుకున్న కర్రలతో విపరీతంగా కొట్టి ఆమెను హతమార్చారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. మహిళ దారుణ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ విషయమై మృతురాలి కూతురు అచ్చమ్మ ఫిర్యాదు మేరకు సీఐ స్వామి గౌడ్ ఆధ్వర్యంలో ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement