Wednesday, May 15, 2024

సిబ్బందిపై కఠిన చర్యలు

మహబూబ్‌నగర్‌ : పనితీరు సరిగా లేని ఏపిఎంలతో సహా మేనేజర్లు , ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు హెచ్చరించారు. వారం రోజుల్లో స్త్రీ నిధి పథకం కింద క్రెడిట్‌ పెంచడంతో పాటు , రుణాల వసూలులో పురోగతి చూపించకపోతే చర్యలు తప్పవని అన్నారు. ఆయన బండమీదిపల్లిలోని టిటిడిసి లో నిర్వహించిన స్త్రీ నిధి జిల్లా స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగాహాజరయ్యారు. మండలాల వారిగా జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహిస్తూ ఎన్‌పిఎం 44 శాతం ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చే వారం రోజుల్లో స్త్రీ నిధిలో ఎన్‌పిఎం తగ్గించడంతో పాటు ,క్రెడిట్‌ను పెంచాలని చెప్పారు. స్త్రీ నిధి కింద మండల సమాఖ్యలు కొత్తగా ఆదాయ మార్గాల అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. సువిధ పథకం కింద రుణాలు మంజూరు చేసేందుకు ప్రోత్సహించాలని , హన్వాడ , రాజాపూర్‌ , బాలానగర్‌ మండలాల పనితీరు బాగుండటం పట్ల ఆ మండల బృందాలను కలెక్టర్‌ అభినందించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ , డిఆర్‌డిఓ వెంకట్‌ రెడ్డి , స్త్రీనిధి డిజిఎం సుమిత్ర , ఆర్‌ఎం శివప్రసాద్‌ , ఏపిజివిబి ఆర్‌ఎం మనోహర్‌ , ఏపిడి శారద, డిపిఎం నాగమల్లిక , జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖ , అరుణ , వరలక్ష్మి , తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement