Tuesday, May 7, 2024

Mahabubnagar – మిస్టర్ ఇండియాకు అండగా నిలుస్తాం…మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, అక్టోబర్ 6 (ప్రభ న్యూస్): మిస్టర్ ఇండియాగా గెలిచి వచ్చే నెలలో జరిగే మిస్టర్ గ్లోబల్ టైటిల్ కోసం పోటీపడుతున్న హైదరాబాద్ కు చెందిన యువకుడు జాసన్ డైలాన్ బ్రెట్ఫీలియాన్ కు అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇటీవలే గోవాలో జరిగిన రుబారు మిస్టర్ ఇండియా- 2023 టైటిల్ పోటీలో విజయం సాధించిన నేపథ్యంలో జాసన్ తన తల్లితండ్రులు రూప్ చందన, వాలెంటీన్ బ్రెట్ఫీలియాన్ లతో కలిసి మహబూబ్ నగర్ లో మంత్రిని కలిశారు.

దేశవ్యాప్తంగా అనేక మంది పోటీ పడినా ఫైనల్ పోరులో గెలిచి తెలంగాణ పేరు నిలబెట్టి మిస్టర్ ఇండియాగా నిలిచినందుకు జాసన్ ను మంత్రి అభినందించారు. థాయిలాండ్ లో జరుగనున్న మిస్టర్ గ్లోబల్ టైటిల్ పోరు కోసం వెళ్లేందుకు ఆర్థికంగా చేయూతను అందిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడల్లో తెలంగాణ దూసుకుపోతోందని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి, రాష్ట్రానికి పేరు తేస్తున్న క్రీడాకారులను గుర్తించి వారికి నగదు బహుమతి, విలువైన ప్రదేశాలలో ఇంటి స్థలాలను అందజేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. జాసన్ మిస్టర్ వరల్డ్ పోటీల్లోనూ టైటిల్ కైవాసం చేసుకుని రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలని అన్నారు.

ఈ సందర్భంగా జాసన్ ను మంత్రి సన్మానించారు. మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అందిస్తున్న సహకారానికి మిస్టర్ ఇండియా జాసన్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement