Tuesday, May 7, 2024

బిసిలకు లక్షసాయం.. మంత్రి గంగుల అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ

తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులవృత్తుల్లోని చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి సీఎం కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బిసీలకు లక్ష పథకంపై నేడు హైదరాబాద్ లోని డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.ఈ పథకం తొలిదశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం కాబినెట్ సబ్ కమిటీకి వివరించారు, అమలు తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు అధికారులకు పలు సూచనలు జారీ చేసారు.వివరాలను మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం తపిస్తారని, కులవృత్తుల్లోని చేతివృత్తులకు చేయూతనిచ్చేందుకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించారన్నారు.

దీంట్లో ఈ రోజువరకూ 2,70,000 ధరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయని, బిసీలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ అన్నారు. మొదటగా అర్హతకలిగిన లబ్దీదారుల్లోని అత్యంత పేదవారికి అందజేస్తూ ప్రతీ నెల 5వ తారీఖులోపు కలెక్టర్లు లబ్దీదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని, ఇంచార్జి మంత్రులు ద్రువీకరించిన జాబితాలోని లబ్దీదారులకు ప్రతీ నెల 15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తామన్నారు. ధరఖాస్తుదారులు కేవలం https://tsobmmsbc.cgg.gov.in వెబ్ సైట్ లో మాత్రమే అప్లై చేసుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఫారంను ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి గానీ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఎంపికైన లబ్దీదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామాగ్రిని కొనుక్కోవాలని సూచించారు గంగుల, లబ్దీదారుల నిరంతర అభివ్రుద్ది కోసం అధికారులు పర్యవేక్షిస్తారని, నెలలోపు లబ్దీదారులతో కూడిన యూనిట్ల పోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుదన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement