Saturday, April 27, 2024

ఇలా చేస్తే భార‌త్ నెంబ‌ర్ వ‌న్ – కెటిఆర్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయిం చినట్లు కనిపించడం లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐ సీసీలో ”డీ కోడింగ్‌ ది ఎకనమిక్‌ ఫ్యూచర్‌.. హైదరాబాద్‌ క్యాటలిస్ట్‌ ఫర్‌ 5ట్రిలియన్‌ ఎకానమీ” అనే అంశం పై ఎన్‌హెచ్‌ఆర్‌డీ నిర్వహించిన 25వ జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ దేశం లో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పని చేసే పరిస్థితి ఉందని విమర్శించారు. మానవ వనరులను సద్వినియోగం చేసుకున్న చైనా, జపాన్‌ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నా యని చెప్పారు. భారత్‌లో ఆర్థికాభి వృద్ధి కన్నా రాజకీయాలపైనే దృష్టి పెడతారని
మంత్రి కేటీఆర్‌ అన్నారు.

భారత్‌లోనూ ఎంతో మంది గొప్పవారు, తెలివైన నేతలున్నారని అయితే మెరుగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్‌ తరాలకు మనకన్నా మంచి భవితను అందించే అంశాలపై వారు దృష్టి పెట్టట్లేదన్నారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతుండడం వల్లే నేతల దృష్టంతా ఎన్నికలపైనే ఉంటోందన్నారు. అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారిస్తే నంబర్‌వన్‌గా ఎదుగుతామని వెల్లడించారు. ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్‌ మన దేశం నుంచి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మన దేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. మొత్తం జనాభాలో 60శాతం మంది యువతేనని తెలిపారు. దేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోందని వెల్లడించారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆలోచన చేయడం లేదన్నారు. సింగపూర్‌ విస్తీర్ణంలో హైదరాబాద్‌ కన్నా చిన్నగా ఉంటుందని, అయినా అభివృద్ధిలో మాత్రం వేగంగా ముందుకెళుతోందని చెప్పారు. గత ఎనిమిదేళ్లలో అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దేశ జీడీపీలో 5 శాతం వాటా తెలంగాణదేనని తెలిపారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపొందడంలో తెలంగాణ పాత్ర కీలకమని చెప్పారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌(త్రీఐ)కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 15 రోజులు దాటితే సంబంధిత అధికారి నుంచి రోజుకు రూ.వెయ్యి చొప్పున పెనాల్టిd వసూలు చేస్తున్నామని చెప్పారు. గత 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదన్నారు. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థల తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయన్నారు. ప్రపంచ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ వెలుగొందుతోందని తెలిపారు. మూడవ వంతు వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతున్నాయని వెల్లడించారు. ఐటీ, అగ్రికల్చర్‌ వృద్ధి ప్రతి ఏడాది పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను నాలుగేండ్లలోనే పూర్తిచేశామన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఆర్‌డీజాతీయ అధ్యక్షులు ఎస్వీ నాథన్‌, ఎన్‌హెచ్‌ఆర్‌డీ హైదరాబాద్‌ అధ్యక్షులు విపుల్‌ సింగ్‌, సెక్రటరీ దాసరి రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement