Sunday, April 28, 2024

Peddapalli: అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారు ?… ఎమ్మెల్యే దాసరి

అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారని ప్రజలు మరోసారి ప్రతిపక్షాలను నమ్మి ఓటు వేస్తారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో గడపగడపకు ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు గ్రామంలో జరిగిన అభివృద్ధిని తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ… గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరుపేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు.

తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరల పంపిణీ లాంటి ఒక్క కార్యక్రమమైనా ఏదైనా రాష్ట్రంలో ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాడు 200 రూపాయల పింఛన్ ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేలకు పెంచారన్నారు. దివ్యాంగుల పెన్షన్ 4 వేలకు పెంచామని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా వెయ్యికి మించి పింఛన్ ఇవ్వడం లేదని, అధికారం కోసం దొంగ హామీలు ఇస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీలు 60గ్యారంటీలు అని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గత రెండు పర్యాయాలు ఆదరించిన విధంగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మద్దతు ఇవ్వాలని కోరారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీపీ బాలాజీ రావు తో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement