Wednesday, May 1, 2024

దోపిడీ కేసులో ఇద్దరి అరెస్ట్ : పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి

35 గ్రాముల బంగారం స్వాధీనం
కారు, ద్విచక్ర వాహనంతో పాటు సెల్ ఫోన్లు సీజ్

జల్సాలకు అలవాటు పడి దోపిడీకి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి మండలం గుర్రాంపల్లిలో ఈనెల 15న రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి చెందిన వంగల శేషమ్మ (70) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్రాంపల్లికి చెందిన మందల రంజిత్ రెడ్డి, గోదావరిఖని 5 ఇంక్లైన్ కు చెందిన వీరబోయిన మధుకర్ యాదవ్ లు శేషమ్మ తలపై దిండు వుంచి ఎలక్ట్రికల్ వైర్ ను మెడకు బిగించి మెడలో ఉన్న మూడున్నర తులాల రెండు బంగారు గొలుసులు, ఇంట్లో ఉన్న 28 వేల రూపాయల నగదును అపహరించుకు పోయారన్నారు. కేసు నమోదు చేసి పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ దర్యాప్తు ప్రారంభించారన్నారు. నిందితులు జలసాలకు అలవాటు పడి గ్రామానికి చెందిన మహిళల నుండి బంగారం దోచుకోవాలని పన్నాగం పన్ని దోపిడీకి పాల్పడ్డారన్నారు. వారం రోజుల క్రితం ఒకసారి ప్రయత్నించగా బాధితురాలు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఉన్న విషయాన్ని గమనించి వెళ్లిపోయారన్నారు. గురువారం రాత్రి గోదావరిఖని నుండి మధుకర్ యాదవ్ కారులో గుర్రాంపల్లి కి రాగా గ్రామ శివారులో కారు ఉంచి రంజిత్ రెడ్డి ద్విచక్ర వాహనంపై వెళ్లారన్నారు. బాధితురాలి ఇంటి వెనకాల ద్విచక్ర వాహనాన్ని ఉంచి ఇంట్లోకి వెళ్లి శేషమ్మ మెడలో నుండి బంగారు గొలుసులు, నగదు అపహరించుకుని పారిపోయారన్నారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బంగారు నగలను అమ్మేందుకు వస్తున్న రంజిత్ రెడ్డి, మధుకర్ యాదవులను శనివారం ఉదయం కూనారం రైల్వే గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల వద్ద నుండి 35 గ్రాముల బంగారం, 24,450 రూపాయల నగదు, ద్విచక్ర వాహనం, కారుతోపాటు మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. దోపిడీ కేసును చేదించిన పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ లు సహదేవ్ సింగ్, మౌనిక సిబ్బంది దుబాసి రమేష్ లను ఏసిపి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement