Thursday, April 25, 2024

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మాచర్ల ఘటన : సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

మాచర్ల ఘటన చూసిన తర్వాత ఏపీలో ప్రజాస్వామ్యం బతికుందా అనే అనుమానం ఏర్పడుతోంది ద‌ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జూలకంటి బ్రహ్మానంద రెడ్డి బలమైన నాయకత్వాన్ని వైసీపీ జీర్ణించుకోలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతోంద‌న్నారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిన అరాచక ఘటనే అన్నారు. మాచర్ల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. అరాచక శక్తులు వచ్చే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తగానే కార్డన్ సెర్చ్ నిర్వహించామని పల్నాడు ఎస్పీ సెలవిచ్చారు.. ముందే తెలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించి పోలీసులు ఏం సాధించారు అని మండిప‌డ్డారు. వైసీపీ గూండాలు జీపులెక్కి విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, అరాచక శక్తుల ఆగడాలతో మహిళలు, తల్లీబిడ్డలు వంటిళ్లలో దాక్కుని ఏడుస్తున్నా ఊరుకోకుండా విధ్వంసం కొనసాగించారు. ఇలాంటి పరిస్థితులు ఏపీలో చూస్తామని అనుకున్నామా అన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లో ఇలాంటి అరాచక శక్తులను అక్కడి ప్రభుత్వాలు అణిచివేసి ప్రశాంత వాతావరణం తెచ్చాయ‌న్నారు. అన్నపూర్ణ లాంటి ఏపీలో మాత్రం అరాచకాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుండటం దురదృష్టకరం అన్నారు. ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఆటవిక పరిస్థితులు ఏపీలో నెలకొనడం బాధాకరమైన విషయమ‌న్నారు. తెలుగుదేశం పార్టీని అణిచివేయడంతో పాటు వేలాది మంది కార్యకర్తలపై కేసులు బనాయించి వచ్చే ఎన్నికలకు వారిని దూరం చేసే కుట్రలో భాగమే ఈ అరాచక పర్వం అని మండిప‌డ్డారు. శాంతి భద్రతలతో పాటు అనేక అంశాల్లో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను మూటగట్టుకుంద‌న్నారు. ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం తగదన్నారు. ప్రశాంత వాతావరణంలో పాలన సాగేలా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంద‌ని సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement