Thursday, May 2, 2024

Peddapalli: ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ దే విజయం.. ఎమ్మెల్యే దాసరి

ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. పెద్దపల్లిలో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లి మండలం రాఘవపూర్ లో ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధితో పాటు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. గత పాలకులు స్వప్రయోజనం కోసం పనిచేసే అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేశారన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.

బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెలా 3 వేల రూపాయలు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతుబంధును రూ.16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందించడంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, నియోజకవర్గ ప్రజల చేతిలో భంగపాటు తప్పదన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో బారాస నాయకులు సత్యనారాయణ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement