Sunday, May 19, 2024

రాజకీయ జోక్యంతో కార్మికులకు తీరని అన్యాయం – ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య

యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి సంస్థలో రాజకీయ నాయకుల జోక్యం అధికం కావడంతో గుర్తింపు సంఘం నాయకుల ప్రాబల్యం తగ్గి కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని ఏఐటీ-యూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. గురువారం రోజు ఆర్జీ2 ఏరియా ఓసీపీ3లో బ్రాంచి కార్యదర్శి రాజారత్నం అధ్యక్షతన జరిగిన గేట్‌ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడుతూ కంపెనీలో రాజకీయ జోక్యం పెరిగి గుర్తింపు సంఘాన్ని పట్టించుకోవడం లేదని, కనీసం స్ట్రక్చర్‌ మీటింగ్‌లు కూడా పట్టించుకోవడంలేదన్నారు. గుర్తింపు సంగం నాయకులు పైరవీలకు పరిమితమయ్యారని, కంపెనీలో సమస్యలు పేరుకు పోయాయన్నారు. ఎన్నికలముందు సీఎం చెప్పిన హామీలేవీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. అండర్‌ గ్రౌండ్‌ మైన్స్‌లో పనులను కాంట్రాక్టు కార్మికులతో చేయిస్తున్నారని, దీనిని అడ్డుకోవడంలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ వారికి అమ్మి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, దానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్‌. ప్రకాష్‌, నాయకులు అన్నారావు, మహేందర్‌, సాంబాశివరావు, నాయకులు గౌతమ్‌ గోవర్ధన్‌, సెగ్గం శంకర్‌, అల్లి రమేష్‌, రాజకుమార్‌, వెంకటేశ్వర్లు, కిరణ్‌ కుమార్‌, నరేష్‌, రవికుమార్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement