Sunday, May 19, 2024

రెండు వ‌ర్గాలుగా చీలిన‌ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్‌ల) సమ్మెపై ఉత్కంఠతోపాటు గందర గోళం నెలకొంది. రెండువర్గాలుగా జేపీఎస్‌లు చీలిపోయారు. ఓ వర్గం సమ్మె విరమించేందుకు సిద్ధమవుతుండగా మరోవర్గం సమ్మె కొనసాగింపుకే మొగ్గు చూపుతోంది. ఈ పరిస్థితుల్లో విధుల్లో చేరాలని, లేనిపక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని జేపీఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అయినప్పటికీ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల్లో మెజారిటీ వర్గం దిగిరాలేదు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్‌ స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో పలు చోట్ల కొందరు జేపీఎస్‌లు విధుల్లో చేరుతున్నట్లు ఎంపీడీవోలకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. రాష్ట్రంలో జేపీఎస్‌ల సంఖ్య 9355గా ఉండగా ఇందులో మంగళవారం సాయంత్రానికి దాదాపు 1000 మంది విధుల్లో చేరుతున్నట్లుగా ఎంపీడీవోలకు లేఖ లు ఇచ్చినట్లు తెలిసింది. ఒక్క నల్గొండలోనే 119మంది, జగిత్యాలలో 50మంది దాకా విధుల్లో చేరుతున్నట్లు పై అధికారులకు రిపోర్టు చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయానికి విధుల్లో చేరిన వారి సంఖ్యపై స్పష్టత వస్తుందని జేపీఎస్‌ల్లో ఓ వర్గం నేతలు చెబుతున్నారు. ఓ వైపు మంగళవారం సాయంత్రంతో ప్రభుత్వం విధించిన గడవు ముగియడం, మరోవైపు విధుల్లో చేరేందుకు కొందరు సుముఖత వ్యక్తం చేయడం, మరికొందరు సమ్మె చేసేందుకే మొగ్గుచూపడంతో గందరగోళం కొనసాగుతోంది.

ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ…
తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు సమ్మెను వీడాలని పిలుపునిస్తుండగా ప్రధాన కార్యదర్శి వర్గం మాత్రం సమ్మెకు మొగ్గు చూపుతుండడంతో జేపీఎస్‌ల సమ్మె పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి విధుల్లో చేరని జేపీఎస్‌ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది ప్రాధాన్యత సంతరించుకుంది. జారీ చేసిన నోటీసుల్లో హెచ్చరించిన మేరకు కఠిన చర్యలు తీసుకుంటుం దా..? లేక డిమాండ్ల పరిష్కారానికి మరోమారు జేపీఎస్‌లను చర్చలకు పిలుస్తుందా..? అన్నది తేలాల్సి ఉంది.

సమ్మె కొనసాగించి తీరుతాం…
తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు 12రోజులుగా సమ్మె చేస్తున్నారు. 2019లో నోటిఫికేషన్‌ ద్వారా తాము ఉద్యోగాలు పొందామని, మూడేళ్ల ప్రొబెషనరీ పీరియడ్‌ తర్వాత ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేస్తామన్నారని, కాని ప్రొబెషనరీ పీ రియడ్‌ను ఏడాది పెంచినా పూర్తి చేశామని, అయినప్పటిెకీ క్రమబద్ధీకరిం చడం లేదని ఆరోపిస్తున్నారు. క్రమ బద్ధీకరించే వరకు సమ్మె విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్‌ తేల్చి చెప్పింది. ఈ మేరకు సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. ప్రభుత్వ హెచ్చిరికల నేపథ్యంలోనూ 13రోజూ బుద‌వారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జేపీఎస్‌లు సమ్మె చేశారు. ఇటు హైదరాబాద్‌ లోని అమరవీరుల స్థూపం ముందు రాష్ట్ర పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్‌ నిరసన చేపట్టింది. ప్రభుత్వం భయపెట్టాలని చూస్తే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా జేపీఎస్‌లు హెచ్చరించారు. ప్రభుత్వం చర్చ లకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించారని, ఆయన స్ఫూర్తితోనే తమ డిమాండ్ల సాధనకు ఉద్యమం చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ఇప్పటికైనా తమపై కక్షసాధింపు చర్యలకు దిగకుండా సుమారు 9355 కుటుంబాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

సాయంత్రం వరకూ జేపీఎస్‌లతో మంత్రి ఎర్రబెల్లి సంప్రదింపులు
జేపీఎస్‌లు సమ్మె విరమించేలా మంగళవారం సాయం త్రం వరకు పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రయత్నించారు. జేపీఎస్‌ల నేతలతో ఫోన్‌లో సంప్ర దింపులు జరిపారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యను త్వరలో సీఎం కేసీఆర్‌ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అయితే కొందరి మాటలు విని జేపీఎస్‌లు తొందరపడి సమ్మెకు దిగా రని అన్నారు. ఉద్యోగాల్లో చేరేటప్పుడే సమ్మెల్లో పాల్గొనబోమ ని, యూనియన్లను పెట్టమని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారని గుర్తు చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి సూచించినా జేపీఎస్‌లు సమ్మె కొనసాగింపుకే మొగ్గు చూపారు.

- Advertisement -

జేపీఎస్‌లకు రాజకీయ పక్షాల మద్దతు…
మద్దతు ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జూనియర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు పలు రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయి. పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు మంగళవారం లేఖ రాశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే వారి పోరాటానికి కాంగ్రెస్‌ మద్దతుగా నిలిచి ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని హెచ్చరించారు. మరోవైపు … జేపీఎస్‌లకు అండగా క్షేత్ర స్తాయిలో నిరసనలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జేపీఎస్‌ల సమ్మె న్యాయమైనదన్నారు. కాగా.. వారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని బీజేపీ సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. బేషజాలకు పోకుండా జేపీఎస్‌లను పర్మినెంట్‌ చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement