Tuesday, April 30, 2024

TS: మోసం చేసింది కేసీఆరే… కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి

ద‌ళితుడ్ని ముఖ్య‌మంత్రి చేశారా..
మూడెక‌రాలు ఇచ్చారా..
హ‌రీష్ చేస్తున్న‌వి డ్రామాలే
కాగితాల‌పై పిచ్చి రాత‌ల‌తో రాజీనామాలా
మండిప‌డ్డ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి
హైద‌రాబాద్ – ఎన్నిక‌ల్లో ఇచ్చిన విధంగా రైతుల‌కు రెండు లక్ష‌లు రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి స్పష్టం చేశారు. దళితులకు మూడెకరాల పేరుతో కేసీఆర్ మోసం చేశారని, ఉపాధి హామీ కూలీలకు వంద రోజుల పని కూడా కల్పించలేదని మండిపడ్డారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… అధికారం పోగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే సీఎం అయ్యేది దళితుడేనని కేసీఆర్ చెప్పారని, దళితుడిని సీఎం చెయ్యకుంటే మెడపై తల ఉండదని గొప్పలు చెప్పారని గుర్తుచేశారు. తొలిసారి పరిపాలన అనుభవం ఉండాలనే తాను సీఎం అయ్యానన్న కేసీఆర్, రెండోసారి కూడా దళితుడిని సీఎం చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హ‌రీష్ వి డ్రామాలే..
కాగా, గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నానని, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు హరీశ్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు హరీశ్ నాటకాలు ఆడుతున్నారన్నారు. రాజీనామా పత్రం ఒకటిన్నర లైన్ మాత్రమే ఉండాలని, కానీ హరీశ్‌రావు ఒకటిన్నర పేజీ రాసుకొచ్చారని విమర్శించారు. ఇప్పటివరకు 40కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నారని, మార్చి 1న ఉచిత విద్యుత్ బిల్లు వచ్చిందో, లేదో తెలుసుకోవాలని కోమటిరెడ్డి సూచించారు.

మెద‌క్ లో బీఆర్ ఎస్ కు డిపాజిట్ రాదు..
లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదని వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఫాంహౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్, ఇప్పుడు కర్రపట్టుకుని బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి మూడు నెలల్లో 60సార్లు సచివాలయానికి వచ్చారని గుర్తుచేశారు. పార్టీ మూతపడే స్థితికి చేరుకోవడంతో ఆ పార్టీ నేత‌ల‌కు ఎక్కడికి వెళ్లాలో వారికి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement