Friday, May 3, 2024

గీత కార్మికుల‌కు కెసిఆర్ వ‌రం – ఒక్కోక‌రికి రూ.5 ల‌క్ష‌ల బీమా…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని గీత కార్మికులకు సీఎం కేసీఆర్‌ మరో వరాన్ని ప్రకటించారు. ఇప్పటికే ప్రమాద బీమా మొత్తాన్ని రెండింతలు చేసిన సీఎం కేసీఆర్‌ సర్కార్‌ తాజాగా వారి అభ్యున్నతికి కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతాంగానికి రైతు బీమా అమలు చేస్తున్న తరహాలోనే కల్లుగీత కార్మికుల కోసం ”గీత కార్మికుల బీమా” అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ పథకం ద్వారా కల్లు గీస్తూ ప్రమాదంతో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను, ఆర్థిక శాఖ మంత్రి
హరీష్‌రావును ఆయన ఆదేశించారు.
బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ఆబ్కారీ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తూ చెట్టుపైనుంచి జారిపడి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్న దురదృష్టకర సంఘటనలు జరుగుతుంటాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ఇప్పటికే ఎక్స్‌గ్రేషియో అందిస్తున్నామని, అయితే బాధితులకు అందడంలో కొంత ఆలస్యం అవుతున్నదన్నారు. ఈ నేపథ్యంలోనే రైతన్నల తరహాలోనే కల్లుగీత వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement