Friday, May 3, 2024

TS: తెలంగాణలో హంగ్ వస్తే.. కాంగ్రెస్ కు మద్దతిస్తాం.. సీతారాం ఏచూరి

తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తే.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి లేదన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందన్నారు. మధ్యప్రదేశ్ లో కొంత బలం ఉన్నా.. ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చన్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ.. బీజేపీ చేతిలో బందీ అయ్యాయని ఆయన ఆరోపించారు.

దేశంలో బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోందన్నారు. ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై అకౌంటబిలిటీ కనిపించడం లేదన్నారు. ఉత్తరాఖండ్ లో టన్నెల్ కు ఎవరు అనుమతి ఇచ్చారో.. ఆ ఘటనకు భాధ్యత ఎవరు వహించాలని సీతారం ఏచూరి ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు మోడీ పాల్పడుతున్నా.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు ఇవ్వదు అంటూ సీతారం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా.. కాంగ్రెస్ కు నష్టం లేదనే భావనలో కాంగ్రెస్ ఉందన్నారు. యాంటీ బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారన్నారు. హంగ్ వస్తే కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు ఉంటుందన్నారు. ఇండియా కూటమిలో ఇప్పటికే ఉన్నామన్నారు. సీపీఎం ఖమ్మం జిల్లాలో పోటీ చేయకుండా పొత్తులు అనేది అసంభవమని సీతారం ఏచూరి పేర్కొన్నారు.ఎన్నికల్లో ధన దాహం విపరీతంగా ప్రభావం చూపుతోందని అన్నారు. పోరాటాలకు ఎర్ర జెండా కావాలి.. ఎన్నికలు వచ్చే సరికి ఇంకో పార్టీ కావాలి.. ఇలా ఎందుకు జరుగుతుందని జనాలను మేము అడుగుతున్నామని సీతారం ఏచూరి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement