Sunday, April 28, 2024

Think and Vote – తెలంగాణ ప్ర‌జ‌లు వేసే ఓటు దేశ భ‌విష్య‌త్ ను నిర్దేశించాలి …. అమిత్ షా

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో యువత, మహిళలు, అన్ని వర్గాలు కెసిఆర్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని , ఈసారి ఇక్కడి ప్ర‌జ‌లు బిజెపికే ప‌ట్టం క‌డ‌తార‌ని పేర్కొన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా..అలాగే . తెలంగాణ ప్రజలు రాష్ట్ర, దేశ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం భాగంగా తెలంగాణ‌కు వ‌చ్చిన ఆయ‌న హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, ద‌ళిత బంధు నిధులు బిఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల జేబుల‌లోకి వెళితే, ప్రాజెక్ట్ ల సొమ్ము కెసిఆర్ ఖ‌జ‌నాల‌కు చేరిందంటూ విమ‌ర్శించారు. . లిక్కర్, గ్రానైట్, మియాపూర్ భూములు, ఓఆర్ఆర్ ఇలా ఈ ప్రభుత్వంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని అన్నారు.


పదేళ్ల పాలనలో అవినీతి తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అమిత్ షా విమర్శించారు. 1,200 మంది బలిదానాలతో తెలంగాణ ఏర్పడితే… రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు. లక్ష రుణ మాఫీ చేయలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఉద్యోగాలను భర్తీ చేయలేదని విమర్శించారు.
ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఆ హామీని నిలుపుకోలేదని అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఎన్నికల ముందు వేర్వేరు కండువాలతో వస్తారని ఎన్నికలయ్యాక కలిసిపోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటు వేసినట్టేనని చెప్పారు. కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. దీంతో కేసీఆర్ విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. సినిమా, ఫార్మా, ఎడ్యుకేషన్ సిటీలని ఏర్పాటు చేస్తానని చేయలేదన్నారు.

ఇక ఇది ఇలా ఉంటే తాము ఇచ్చిన హామీలు ఈ 9 ఏళ్లలో నెరవేర్చామన్నారు. 370 ఆర్టికల్ ఎత్తేసామని తెలిపారు. అయోధ్యలో రామాలయం, ట్రైబల్ తలక్ , గ్రామీణ రోడ్లు, ప్రతి పేద వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం, ఇల్లు ఇలా ఎన్నో చేస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి ఉండదని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తామని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికలు తెలంగాణకు అవసరమని చెప్పారు. తెలంగాణ ప్రజల ఓటు మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement