Sunday, April 28, 2024

AP ప్రత్తిపాడు వైసీపీలో ప్రకంపనలు.. ఇద్దరు ఎంపీపీలతో సహా నలుగురు రాజీనామా..!

కాకినాడ, నవంబర్ 25: ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఇద్దరు ఎంపీపీలతో సహా నలుగురు వైసీపీకి రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇవాళ వైఎస్సార్ పార్టీకి ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి), గంటిమళ్ళ రాజ్యలక్ష్మి, తూర్పు లక్ష్మీపురం సర్పంచ్ డాక్టర్ వీరంరెడ్డి సత్య నాగ భార్గవి, భద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాబ్జీలు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తమ రాజీనామాలకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ అవలంబిస్తున్న తీరే కారణమని వారు చెప్పారు. శనివారం కాకినాడలో ఉన్న ఓ హోటల్లో వారు వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా బుజ్జి, రాజ్యలక్ష్మి, నాగ భార్గవి, బాబ్జీలు మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో వైకాపా ప్రభుత్వంతో పాటు నియోజవర్గ ఎమ్మెల్యేగా పర్వతను గెలిపించుకున్నామని చెప్పారు. తాము ఎన్నికైన సుమారు మూడున్నర సంవత్సరకాలం నుంచి ఎమ్మెల్యే పర్వత వల్ల ఎన్నో అవమానాలు, వేధింపులకు గురవుతున్నామన్నారు. అయినా ఓర్చుకొని ఈ విషయాన్ని రీజనల్ కోఆర్డినేటర్ పీవీ మిథున్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబులకు తెలియజేసినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం వైకాపా పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తున్నామని, పదవులకు రాజీనామా చేసే విషయంలో తమ తమ అనుచరుల అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.


పార్టీ నిర్వహించిన సామాజిక బస్సు యాత్రకు తమకు ఎమ్మెల్యే పర్వత నుండి కానీ, పార్టీ నుండి కానీ పిలుపు రాలేదన్నారు. ఇలా తమను దూరం పెట్టడంతో మనస్థాపానికి గురై రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నట్లు బుజ్జి, రాజ్యలక్ష్మి, నాగ భార్గవి, బాబ్జిలు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గం అంతా ఎమ్మెల్యే తీరు వల్ల పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు నష్టం వాటిల్లుతోందని అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భద్రత కరువైందన్నారు. పార్టీ మార్పు విషయంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తాము సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్ణయం ప్రకటిస్తామన్నారు. పోలీసుల ద్వారా ఎమ్మెల్యే పర్వత తమను బెదిరింపులతోనూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నట్లు బుజ్జి, రాజ్యలక్ష్మి, నాగ భార్గవి, బాబ్జీలు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement