Monday, April 29, 2024

ఎన్నో మైలురాళ్ల‌ను అధిగ‌మించి… అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ : జాయింట్ సీపీ

ఎన్నో మైలురాళ్లను అధిగమించి శరవేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని జాయింట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీసు ఎం.ర‌మేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాదు సీపీ కార్యాలయం బషీర్‌బాగ్‌లో ఘనంగా జరిగాయి. నగర్ పోలీసు కార్యాలయంను దేదీప్యమానంగా అలంకరించారు. 8వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వార్షికోత్సవం సందర్భంగా జాయింట్ సీపీ రమేశ్ ఐపిఎస్, అడ్మినిస్ట్రేషన్ హైదరాబాదు పోలీసు కమిషనర్ తరపున పోలీసు కమిషనర్ కార్యాలయం బషీర్ బాగ్ నందు జెండాను ఎగురవేసి కార్యాలయ సిబ్బంది అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్భంగా జాయింట్ సి.పి మాట్లాడుతూ… భారతదేశంలోనే మన రాష్ట్రం అత్యంత పిన్న వయస్సు క‌లిగిన రాష్ట్ర‌మ‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో వచ్చిన కీలక మార్పులను తెలిపారు. శాంతి భద్రతలు, మహిళా భద్రత, విస్తృత సీసీ టీవీ నెట్‌వర్క్, ఆధునిక పోలీసింగ్ చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర విధాన నిర్ణయాలు ఒక పునాదిగా పనిచేశాయన్నారు. దీని ఆధారంగా రాష్ట్రం ప్రపంచ పెట్టుబడిదారులకు ఇష్టమైన గమ్యస్థానంగా అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ నగరం భారతదేశంలో నివసించదగిన, సురక్షితమైన నగరాల్లో ఒకటిగా ఉద్భవించిందని తెలిపారు. ప్రజలు కష్టపడి పనిచేసే స్వభావం, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వినూత్న విధానాలు అభివృద్ధికి దోహదపడ్డాయన్నారు. విభిన్న సంస్కృతులు, జాతీయాలు, మతాల కేంద్రంగా ఉన్న రాష్ట్రం అన్ని రంగాల్లో ఆకట్టుకునే పురోగతిని సాధించిందని యం.రమేశ్ తెలిపారు. కార్యాలయములో ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దిన కార్యాలయ సిబ్బంది పద్మజ, కల్యాణి, కవిత, ఉర్మిళా ల‌ను జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు అభినందించారు. శ్రీదేవి ఏడీఓ, జి.సత్యనారాయణ అకౌంట్స్ ఆఫీసర్, రాఘవేంధ్ర, ఇన్ స్పెక్టర్ ఐటి సెల్, యం.రాజు ఇన్ స్పెక్టర్, నిరంజన్ ఇన్ స్పెక్టర్ కంట్రోల్ రూమ్, ఎస్.ప్రశాంత్ బాబు ఆర్ఐ బిల్డింగ్ ఇంచార్జ్, జిఎస్.వినయ్ కుమార్, పిఎ టు అడ్మిన్, శ్రీనివాస్ అధ్యక్షుడు మీనిస్టీరియల్ స్టాఫ్ , యన్.శంకర్ రెడ్డి పోలీసు అధికారుల సంఘం, ఇతర అధికారులు, కార్యాలయ సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement