Saturday, May 4, 2024

Hyd | సీఎం కేసీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

పార్లమెంటులో సీఎం కేసీఆర్ పై, తెలంగాణ సర్కారుపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్​లోని తార్నాకలో బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సిఎం కేసీఆర్ దేనని గుర్తు చేశారు. బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రైతులు దిక్కులు చూస్తే.. సిఎం కేసీఆర్ దీక్షా దక్షతతో అన్నదాతలకు ఆత్మగౌరవం పెరిగిందన్నారు.

24 గంటల కరెంటుపై అటు కాంగ్రెస్, ఇటు బిజెపి అవాకులు చవాకులు పేలుతున్నాయని, ఏ అంశంలోనూ మాట్లాడలేక అన్నదాతలను రెచ్చగొట్టేందుకు పూనుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమం జీవితం, ఆయన కష్టాలను తెలంగాణ ప్రజలందరూ గుర్తెరిగినవారే అని చెప్పారు. అనుచిత వ్యాఖ్యలతో పబ్బం గడుపుకోవాలని చూసే పార్టీలకు రాబోయే ఎన్నికల్లో కాలం చెల్లినట్టేనని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement