Thursday, May 2, 2024

HYD: మహిళపై దాడికి కారకులైన పోలీసులు, ఎస్ హెచ్ ఓ, ఏసీపీపై చర్యలు తీసుకోవాలి.. ర‌ఘునంద‌న్

కర్మన్ ఘాట్, ఆగస్ట్ 19 (ప్రభ న్యూస్) : గిరిజన మహిళపై దాడికి కారకులైన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయడమే కాదు ఎస్ హెచ్ ఓ, ఏసీపీని తక్షణమే సస్పెండ్ చేయాలని శాసనసభ్యులు రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్ తో ఆస్పత్రి నుండి ఫోన్ లో మాట్లాడి గిరిజన మహిళపై జరిగిన దాడికి కారకులైన పోలీస్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా రక్షించవలసిన పోలీసులు భ‌క్షించే విధంగా వ్యవహరిస్తూ పాలక వర్గానికి వంత పలుకుతూ ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురిచేయడం తగునా అని ఆయన ప్రశ్నించారు.

ఏదో రాష్ట్రంలో జరిగిన సంఘటనకు నిమిషాల్లో స్పందించే మంత్రులు కూత వేటు దూరంలో జరిగిన సంఘటనకు ఎందుకు స్పందించలేకపోయారని ప్రశ్నించారు. కర్మన్ ఘాట్ ప్రధాన రహదారిలోని జీవన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వర్త్య లక్ష్మిని ఎమ్మెల్యే రఘునందన్ రావు, రంగారెడ్డి బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు వంగ మధుసూదన్ రెడ్డి, రావుల వెంకటేశ్వర రెడ్డి పరమర్శించారు. వారు లక్ష్మి కూతురు వివాహానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేసి, బీజేపీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement