Friday, May 3, 2024

రెండేళ్లుగా కారులోనే నివాసముంటున్న మహిళ

అమీర్‌పేట: ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. పేరు తప్ప ఇంకేమీ చెప్పడం లేదు. తన పేరుతోనే రిజిస్టరయి ఉన్న కారులో ఓ మహిళ ఏకంగా రెండేళ్లుగా నివాసముంటోంది. నగరంలో ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మధురానగర్‌ మెయిన్‌ రోడ్డులో ఉన్న పాడైన కారులో మహిళను పోలీసులు గుర్తించారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం…. మధురా నగర్‌లోని మెయిన్ రోడ్డులో రెండేళ్లుగా ఉన్న ఓ మారుతీ ఓమ్ని కారు (ఎ.పి.31క్యు-6434) లో మహిళ నివాసముంటున్నట్లు స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ మహిళతో మాట్లాడారు. తన పేరు గుర్రం అనిత (30) అని చెప్పడంతో ఇతర వివరాల కోసం ఆరా తీశారు. అనిత స్థానికంగా ఉన్న రాజ్‌ధూత్‌ హాస్టల్‌లో ఉండేది. ఫీజు చెల్లించకపోవడంతో రెండేళ్ల క్రితం హాస్టల్‌ నిర్వాహకులు ఖాళీ చేయించారు. దీంతో తన సామాగ్రి తీసుకుని అప్పటినుంచి కారు లోనే ఉంటోంది. కారునే ఇంటిలా మార్చుకుని ఉంటున్న అనితకు స్థానికులు ఆహారం అందజేస్తున్నారు. అందులోనే నిద్రపోతూ, రోజంతా అందులోనే కూర్చుంటోంది. కారును రోడ్డుపై నిలిపి ఉంచినందుకు రెండేళ్లుగా ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు కూడా విధించారు. మహిళకు కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు ఇలా కారులో ఉండటం శ్రేయస్కరం కాదని, స్టేట్‌హోం తరలించి ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు. అందుకు అనిత అంగీకరించలేదు. ఆమెకు మరోసారి కౌన్సెలింగ్‌ ఇస్తామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement