Friday, May 3, 2024

హైద‌రాబాద్ గ్యాంగ్​ రేప్ కేసు.. పోలీసుల తీరుపై జాతీయ మ‌హిళ క‌మిష‌న్ సీరియ‌స్‌

హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్ నుంచి మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన‌ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఈ కేసు విచారణకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసుశాఖకు నోటీసులు జారీచేసింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే వీడియోలను ఆన్‌లైన్ నుంచి తొలగించాలని కోరారు. అట్లాంటి వీడియోలను పోస్టుల చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళ కమిషన్ డీజీపీని కోరింది. మరోవైపు జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ నుంచి పోలీసు శాఖకు నోటీసులు అందాయి. ఇప్పటికే ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఈ రేప్ ఇన్సిడెంట్‌పై పోలీసులు తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇందులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం ఉందని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా జాతీయ మహిళా కమిషన్‌కు కంప్లెయింట్ చేయాల‌ని కూడా బీజేపీ నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పాటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల వైఖరిని కూడా మహిళా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ లీడ‌ర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ కార్యాలయంలో కొంతమంది ముఖ్యనేతలు, లీగల్‌సెల్‌ ప్రతినిధులతో సమావేశమై అత్యాచార ఘటనపై చర్చించారు. బీజేపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో దీనిపై బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాడానికి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement