Friday, April 19, 2024

ఆన్ లైన్ లో ర‌మ్మీ-ల‌క్ష‌లు పోగొట్టుకున్న మ‌హిళ‌- మ‌న‌స్తాపంతో ఆత్మ‌హ‌త్య‌

ఆన్ లైన్ లో రమ్మీ ఆడి లక్షల్లో పోగొట్టుకుని, చివరికి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది ఓ మ‌హిళ‌. చెన్నై మనాలి న్యూ టౌన్ లో నివసించే బి.భవాని బీఎస్సీ పట్టభద్రురాలు. ఆమె వయసు 29 సంవత్సరాలు. ఆమెకు భర్త భక్కియరాజ్ (32), ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఒకరికి మూడేళ్ల వయసు కాగా, మరొకరికి ఏడాది వయసు. భవాని ఓ ప్రైవేటు హెల్త్ కేర్ సంస్థలో పనిచేస్తుండగా, ఆమె భర్త తొరైపాక్కంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. వీరికి ఆరేళ్ల కిందట పెళ్లయింది. అయితే భవాని కరోనా లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ రమ్మీకి బానిసగా మారింది. భవాని పేకాట పిచ్చి గమనించిన భర్త, తల్లిదండ్రులు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. వారి మాటలను పెడచెవినపెట్టిన ఆ మహిళ ఎప్పటికైనా భారీగా డబ్బు రాకపోతుందా అన్న ఆశతో ఆన్ లైన్ జూదంలో నిత్యం మునిగితేలేది. ఉన్న డబ్బంతా అయిపోగా, బంగారు నగలు తీసుకుని తాకట్టు పెట్టి ఆన్ లైన్ రమ్మీ ఆడింది. ఆ నగల విలువ రూ.10.5 లక్షలు. ఈసారి కూడా భవాని ఆన్ లైన్ రమ్మీలో నష్టపోయింది. నగలు విడిపించుకోవాలంటూ అక్కచెల్లెళ్ల నుంచి అప్పు తీసుకుంది. నగలు విడిపించుకోవడానికి బదులు, ఆ డబ్బును కూడా ఆన్ లైన్ పేకాటలో పెట్టేసింది. ఆ డబ్బులు కూడా పోవడంతో తీవ్ర మనో వేదనకు గురైన భవాని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భవాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement