Friday, May 3, 2024

Hyd: పొల్యూష‌న్ కంట్రోల్ కావ‌ట్లే.. డేంజర్ జోన్‌లోకి హైదరాబాద్‌

హైదరాబాద్ మహానగరంపై వాయు కాలుష్యం మళ్లీ ప్రతాపం చూపుతోంది. కరోనా వల్ల వచ్చిన లాక్‌డౌన్‌ కారణంగా భారీగా తగ్గిన కాలుష్యం ఇప్పుడు విపరీతంగా పెరుగుతోంది. సిటీ కాలుష్యం ఇప్పుడు ఢిల్లీతో పోటీ పడుతోందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ తాజా అధ్యయనంలో వెల్లడించింది.

నగరంలో మోటారు వాహనాల ద్వారానే వాయు కాలుష్యం పెరుగుతున్న‌ట్టు గుర్తించారు. వాటి నుంచి వెలువడే నైట్రోజన్‌ డయాక్సైడ్‌ పెద్ద మొత్తంలో వెలువడుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. హైదరాబాద్‌‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గాలి నాణ్యత క్షీణిస్తోంది. కొద్ది రోజులుగా వాయు కాలుష్యం స్థాయి పెరుగుతూ వస్తుంది.

ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ వాయు కాలుష్య ప్రభావం పెరుగుతోంది. నవంబర్ నుండి జనవరి మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇట్లాంట‌ప్పుడే గాలి నాణ్యత మరింత క్షిణిస్తుందని నిపుణులంటున్నారు. ఈ ప్రభావం పిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్‌, ఆస్తమా, గుండె జబ్బులున్నవారిపై ఎక్కవగా ఉంటుందని డాక్ట‌ర్లు హెచ్చరిస్తున్నారు.

సిటీలో వెహిక‌ల్స్ విప‌రీతంగా పెరిగాయి. వాహనాల నుండి వెలువడే నైట్రోజన్ డయాక్సిడ్‌తో వాయుకాలుష్యం తీవ్రరూపం దాలుస్తోంది. అటు హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అతిసూక్ష్మ ధూళికణాలు పరిమితికి మించి నమోదవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు CPCB గణాంకాల ప్రకారం.. సనత్‌నగర్‌లో పీఎం 2.5 స్థాయి 52.32 మైక్రో గ్రాములుగా, ఐడీఏ బొల్లారంలో 48.85, జూపార్క్‌లో 58, ఇక్రిశాట్‌ 41.71, సెంట్రల్‌ యూనివర్సిటీ 37.48, ఐడీఏ పాశమైలారం వద్ద 42.8 మైక్రో గ్రాములుగా నమోదయ్యాయి.

CPCB ప్రమాణాల ప్రకారం పీఎం 2.5 గరిష్ఠ పరిమితి ఘనపు మీటరు గాలిలో 40 మైక్రో గ్రాములు మించకూడదు. కానీ పరిస్థితులు అందుకు బిన్నంగా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టిసారించడం లేదని నగరవాసులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement